ఉచిత ఇసుక ముసుగులో దోచుకుంటున్నారు: మాజీ సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు
x

ఉచిత ఇసుక ముసుగులో దోచుకుంటున్నారు: మాజీ సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా? లభిస్తే ఎక్కడో చెప్పగలరా? భరించలేని రేట్లతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారా? లేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.


ఉచిత ఇసుక ముసుగులో అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉచిత ఇసుక పేరుతో అందిన కాడికి దండుకోడానికే అధికార పార్టీ ముసుగు తీసిందని విమర్శలు గుప్పించారు. వర్షా కాలంలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయే పరిస్థితి ఉంటుందని, దీంతో ఇసుక కొరత రాకుండా ఉండేందుకు తమ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందన్నారు. స్టాక్‌ పాయింట్లలో పెద్ద ఎత్తున ఇసుక నిల్వలు చేపట్టిందన్నారు. ఆ ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తామంటూ ఉచిత ఇసుక పేరుతో దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఆయన ఏమన్నారంటే..

1. పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, మొత్తం ఆ ఇళ్లల్లో దోపిడీలకు దిగాడంట. ఇసుక దోపిడీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు మోడస్‌ ఆపరండీ కూడా అలాగే ఉంది. గత ప్రభుత్వం మీద నిందలు వేసి, అబద్ధాలు చెప్పి, ఇప్పుడు ఇసుక వ్యవహారంలో సీఎం చంద్రబాబు చేస్తున్నదేంటి? అందుకే సీఎం చంద్రబాబునే అడుగుతున్నా, రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా? లభిస్తే ఎక్కడో చెప్పగలరా? మా ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అదికూడా లేదు. అసలు ఇసుక కొందామంటేనే మా ప్రభుత్వంలో కన్నా రేటు రెండింతలు ఉంది. ఎన్నికల్లో ఉచితంగా ఇసుకను ఇస్తామంటూ ఊరూరా డప్పువేసిన విషయాన్ని మరిచిపోయారా? ఇది ప్రజలను పచ్చిగా మోసం చేయడం కాదా? అధికార దుర్వినియోగంతో ఇసుకచుట్టూ ఒక మాఫియాను మీరు ఏర్పాటు చేయలేదా? భరించలేని రేట్లతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారా? లేదా?
2. ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలి క్షణంలోనే కూటమి పార్టీలకు చెందిన నేతల చూపులు ఇసుక నిల్వలపై పడ్డాయన్నది నిజం కాదా? వర్షా కాలంలో ఇబ్బందులు రాకుండా వైయస్సార్‌సీపీ ప్రభుత్వం స్టాక్‌యార్డుల్లో ఉంచిన సుమారు 80 లక్షల టన్నుల్లో సగం ఇసుక, మీ ప్రభుత్వం వచ్చి నెలరోజులు గడవకముందే ఎక్కడకు పోయింది? ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే కూటమికి చెందిన పార్టీల నేతలు దోచేయలేదా? కొండల్లా ఉండే ఇసుక నిల్వలు కొన్నిరోజుల వ్యవధిలోనే మాయం అయిపోయాయన్నది నిజంకాదా?
3. 2014–19 మధ్య ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రానీయకుండా పక్కా అవినీతి పథక రచనతో ఇసుకను దోచేసిన వ్యవహారం, మళ్లీ ఇప్పుడు పునరావృతమైందన్నది వాస్తవం కాదా? ఈ మోడస్‌ ఆపరండీకి సృష్టి కర్త మూల పురుషుడు మీరే కదా చంద్రబాబుగారూ! ఆ రోజుల్లో ఇసుక బాధ్యతలను మొదట ఏపీఎండీసీకి అప్పగించారు. ఆ తర్వాత డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నామన్నట్టుగా బిల్డప్‌ ఇచ్చారు. 2 నెలలు కాకుండానే దాన్నీ రద్దుచేసి టెండర్లు నిర్వహిస్తామన్నారు. చివరకు ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఉచిత ఇసుక పేరుతో ఒకే ఒక్క మెమో ఇచ్చి అప్పనంగా మీ మనుషులకు అప్పగించారు. మొత్తంగా 19 జీవోలు ఆ ఐదేళ్లలో ఇచ్చారు. ఈ నది, ఆ నది అని లేకుండా ప్రతిచోటా ఇసుకను కొల్లగొట్టి వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారు.
4. ఇప్పుడు కూడా జరుగుతున్నది సేమ్‌ టు సేమ్‌. అధికారంలోకి వచ్చి 4 నెలలు అయినా ఇప్పటికీ స్పష్టమైన ఇసుక విధానం లేదు. పేరుకు ఉచితం అంటున్నారంతే.. మొత్తం వ్యవహారం అంతా చంద్రబాబు, ఆయన ముఠా వల్ల, ముఠా కొరకు, ముఠా చేతులమీదుగా నడుస్తోంది. పాలసీని ప్రకటించకుండా ప్రజలంతా దసరా పండుగలో ఉంటే, దొంగచాటుగా టెండర్లు పిలవడం నిజంకాదా చంద్రబాబు? దేశంలో ఎక్కడా చూడని విధంగా ఉద్దేశపూర్వకంగా కేవలం 2 రోజులు మాత్రమే గడువు ఇచ్చింది మీ స్వార్థం కోసం కాదా? ఎవ్వరినీ టెండర్లలో పాల్గొనకుండా దౌర్జన్యాలకు పాల్పడిన మాట వాస్తవం కాదా?
5. అదే వైయస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని అమలు చేసింది. దోపిడీలకు అడ్డుకట్టవేసి ఇటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, అటు వినియోగదారునికీ సరసమైన ధరకు అందించింది. అత్యంత పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వ ఫ్లాట్‌ఫాం మీద ఇ–టెండర్లు నిర్వహించింది. రీచ్‌ల వద్ద ఆపరేషన్‌ ఖర్చులతో కలిపి టన్ను ఇసుకను రూ.475లకే సరఫరాచేసింది. ఇందులో రూ.375లు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేలా చేసింది. రవాణా ఛార్జీలతో కలిపి ప్రతి నియోజకవర్గానికీ ఇసుకరేట్లను ప్రకటించింది. వైయస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని నిరంతరం దుమ్మెత్తిపోసే పత్రికల్లో కూడా నియోజకవర్గాల వారీగా పారదర్శకంగా రేట్లపై ప్రకటనలు ఇచ్చింది. ప్రజలకు తక్కువ ధరకు ఒకవైపు ఇస్తూ, మరోవైపు రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చేట్టుగా చేసింది. రేట్లపై సెబ్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేసి, తప్పులకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు తీసుకుంది. తద్వారా ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయాన్ని ఖజానాకు వచ్చేలా చేసింది.
మరి మీ హయాంలో ప్రభుత్వానికి ఒక్క రూపాయి రావడంలేదన్నది వాస్తవం కాదా? ప్రజలకూ ఉచితంగా అందడంలేదన్నది నిజం కాదా? ఇసుక ఉచితమే అయితే వైయస్సార్‌సీపీ హయాంలో కన్నా రేట్లు 2–3 రెట్లు ఎందుకు పెరిగాయి? మరి ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది చంద్రబాబు? అంటూ సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
Read More
Next Story