
విఆర్ పాఠశాలను తిరిగి ప్రారంభించిన లోకేష్
150 ఏళ్ల చరిత్ర ఉన్న నెల్లూరు వీఆర్ హైస్కూల్ మూతపడింది. మంత్రి నారాయణ దీనిని తిరిగి బాగు చేశారు.
వీఆర్ పాఠశాలకు 150 ఏళ్ల చరిత్ర ఉన్నది. ఆరు నెలలు కిందట ఘోరమైన పరిస్థితి చూస్తే చాలా ఆశ్చర్యపడ్డాను. ఇప్పుడు చూస్తే నేను అసూయ పడేలా మంత్రి నారాయణ మార్చేశారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అన్నారు. చాలా చక్కగా మంత్రి నారాయణ (Minister Narayana) వీఆర్ హైస్కూల్ను తీర్చిదిద్దారని అభినందించారు. నెల్లూరులోనే ఇలాంటి అత్యాధునిక స్కూల్ ఎక్కడా లేదని, అందుకే ఇక్కడ చేరామని పిల్లలు చెబుతున్నారన్నారు. నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం ప్రారంభించారు.
భూమి కంటే ఎక్కువుగా మన భారం మోసేది అమ్మ. అందుకే తల్లికి వందనం పేరుతో తల్లిని గౌరవిస్తూ ముందుకు వెళుతున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. సౌత్ ఇండియాలో ఇన్ని వసతులు ఉన్న స్కూల్ మరొకటి ఉండదేమో అని చెప్పుకొచ్చారు. మంత్రి నారాయణ, ఆయన కుమార్తె శరణి చేసిన కృషి చాలా గొప్పదని మంత్రి కొనియాడారు. రాష్ట్రంలో పేద కుటుంబమే ఉండకూడదని, ప్రతీ ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని సీఎం చంద్రబాబు P4 తీసుకొచ్చారని తెలిపారు. మంగళగిరిలో ఓడిపోయినప్పుడు బాధపడ్డానని, కానీ గెలవాలనే లక్ష్యంతో కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలుపొందానని వెల్లడించారు. అందరూ వద్దన్నా కూడా కష్టమైన విద్యాశాఖ తీసుకున్నానని తెలిపారు.
ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు సూచనతో మధ్యహ్న భోజనంలో సన్నబియ్యం అన్నం తెచ్చామన్నారు. తొమ్మిది వేల స్కూళ్లలో ఒకే క్లాస్, ఒకే టీచర్ ఉన్నారన్నారు. మెగా డీఎస్సీ ద్వారా ఖాళీలను భర్తీ చేస్తున్నామని తెలిపారు. పవనన్న చెట్లు నాటాలని పిలుపునిచ్చారని, పిల్లలకు గ్రీన్ కార్డులు ఇవ్వబోతున్నామని తెలిపారు. మొక్కనాటి మూడేళ్లు కాపాడే బాధ్యత వారిపై ఉంచుతామని అన్నారు.