
మావోయిస్టు మల్లోజులకు కార్పొరేట్ ‘బ్రాండ్ ఎంబాసిడర్’ ఉద్యోగం
శాంతి దూత గా ఉద్యోగం ఇస్తామంటున్న లాయడ్స్ స్టీల్ కంపెనీ
రెండు రోజుల కిందట లొంగిపోయిన ప్రముఖ మావోయిస్టు నాయకుడు మల్లోజుల వేణుగోపాల రావు ఎలియాప్ భూపతికి మహారాష్ట్ర గచ్చిరోలి ప్రాంతంలోని ఒక మైనింగ్ కంపెనీ భారీ ఉద్యోగం ఆఫర్ చేసింది.
గచ్చిరోలి ప్రాంతంలో లాయడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ ( LMEL) కంపెనీ మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ఈ ప్రాంతంతలో ఎప్పటినుంచో మైనింగ్ చేస్తూ ఉంది. మావోయిస్టు కార్యకలాపాల వల్ల బాగా నష్టపోయింది కూడా. ఇపుడే ఇదే కంపెనీ మల్లోజుల తో పాటు లొంగిపోయిన 61 మంది మావోయిస్టులకు ఉద్యోగాలకు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. మల్లోజులకు కంపెనీ బ్రాండ్ ఎంబాసిడర్ గా ఉద్యోగం ఇస్తానని కంపెనీ ప్రకటించింది.
మహారాష్ట్ర సూరజ గడ్ ప్రాంతంలో లాయడ్స్ కంపెనీ ఐరన్ ఓర్ మైనింగ్ జరుపుతూ ఉంది. ఇక్కడ ఒక ఇంటెగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలని భావిస్తూ ఉంది. భారతదేశంలో లాయడ్స్ అనేది అతి పెద్ద ఇనుప ఖనిజం గనిని నిర్వహిస్తూ ఉంది.
మల్లోజులతో పాటు 61 మంది మావోయిస్టులు ఆయుధాలను వదిలేసి జనజీవనంలోకి రావడం కొత్త ఉషోదయమని, ఈ సందేశం జిల్లా మొత్తం వ్యాప్తి చేయాలని చెబుతూ దీనికోసం లొంగిపోయిన మావోయిస్టులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కంపెనీ ఎండి బి ప్రభాకరన్ సుముఖత వ్యక్తం చేశారు.
కంపెనీలో ఇప్పటికే 71 మంది మాజీ మావోయిస్టులు పనిచేస్తున్నారు. అదే విధంగా సుదూర గిరిజన ప్రాంతాలకు చెందిన వారు మరొక 1400 మంది దాకా కంపెనీలో పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.
మావోయిస్టుల కారణంగా ఈ గిరిజన ప్రాంతాలలో రోడ్లువేసేందుకు సెక్యూరిటీ దళాలు చాలా కష్టపడుతూ వచ్చాయని ఆయన చెప్పారు.
"లొంగిపోయిన మావోయిస్టులలో వారి వారి విద్య పనితనాలను బట్టి లాయడ్స్ మైనింగ్ కంపెనీలో ఉద్యోగాలు ఇస్తాము. ముఖ్యంగా భూపతి వంటి వారికి వారి సామర్థ్యం బట్టి మంచి ఉద్యోగాలే వస్తాయి,’’అని ప్రభాకరన్ చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.
లొంగిపోయిన మావోయిస్టులు ఒక ఏడాది పాటు రీ ఇంటెగ్రేషన్ శిక్షణ పొందుతారు. తర్వాత ఒక ఏజన్సీ వారి గుర్తింపు కార్డులను, బ్యాంక్ అకౌంట్లను తనిఖీ చేస్తుంది. ఆ పైన వారికి ఉద్యోగాలు లభిస్తాయి.
గచ్చిరోలి ప్రాంతంలో పనిచేయడం ఈ కంపెనీకి అంత సులభం కాదు. అందుకే మాజీ మావోయిస్టులకు ఉపాధి కల్పించాలని భావిస్తున్నది. 2013లో మావోెయిస్టులు ఇదే కంపెనీకి చెందిన ఒక ఉన్నతోద్యోగి (వైస్ ప్రెశిడెంట్) ని చంపేశారు.
బుధవారం నాడు, మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమంలో మాట్లాడుతూ, గచ్చిరోలి ప్రాంతాభివృద్ధికి 3 లక్షలకోట్లరుపాయాలను కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఫడ్నవీస్ చెప్పారు. గచ్చిరోలి ప్రాంతాన్ని భారతదేశంలోని మొట్టమొదటి ‘గ్రీన్ స్టీల్ హబ్ ’ అవుతుందని ఆయనే చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఫడ్నవీస్ లొంగిపోయిన మల్లోజులతో కరచాలనం చేశారు. ఈ లొంగుబాటు ఒక అభివృద్ధిలో ఒక మైలు రాయి అని వర్ణించారు. మధ్యభారతంలో ఏర్పాటయిన రెడ్ కారిడార్ కుముగింపు అన్నారు.