ఏపీలో లిక్కర్ షాపుల లాటరీ రేపే, ఎల్లుండి నుంచే రూ.99లకే క్వార్టర్!
x

ఏపీలో లిక్కర్ షాపుల లాటరీ రేపే, ఎల్లుండి నుంచే రూ.99లకే క్వార్టర్!

ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాల కేటాయింపుపై అక్టోబర్ 14న లాటరీ నిర్వహిస్తారు. ఆ మర్నాటి నుంచి రూ.99లకే క్వార్టర్ మద్యాన్ని విక్రయిస్తారు.


ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాల కేటాయింపుపై అక్టోబర్ 14న లాటరీ నిర్వహిస్తారు. రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలకు 89,882 దరఖాస్తులు వచ్చాయి. 1798 కోట్ల రూపాయల దరఖాస్తు ఫీజు వచ్చింది. ఇదంతా తిరిగి ఇచ్చేది కాదు. మద్యం షాపు వచ్చినా రాకపోయినా ఆ డిపాజిట్ సొమ్మంతా ప్రభుత్వానికి మిగులు తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దుకాణాలకు మంచి గిరాకీ ఉన్నా అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు మాత్రం అతి తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. వాటికి మరోసారి దరఖాస్తులు పిలుస్తారని అంచనా. ఎన్టీఆర్ జిల్లాల్లోని 113 దుకాణాలకు అత్యధికంగా 5,764 దరఖాస్తులు వచ్చాయి.

జిల్లాల వారీగా దుకాణాలకు అక్టోబర్ 14న లాటరీ నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఎక్కువ మంది తెలుగుదేశం మద్దతుదారులే ఈ షాపులకు పోటీ పడ్డారు. ఎవరికి దక్కుతాయనే దానిపై దరఖాస్తు దారుల్లో ఉత్కంఠ నెలకొంది. సోమవారం లాటరీ, మంగళవారం దుకాణాల అప్పగింత, 16వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం ప్రకారం షాపుల్లో అమ్మకాలు చేపడతారు. దేశంలో తయారైన విదేశీ మద్యం బాటిళ్ల ఎమ్మార్పీ ధరను చిల్లర లేకుండా సర్దుబాటు చేసేలా అదనపు ప్రివిలేజ్ ఫీజును విధించనుంది. క్వార్టర్ బాటిల్‌ను 99 రూపాయలకే అమ్ముతారని, అది కూడా నాణ్యమైన మద్యమేనని ప్రభుత్వం చెబుతోంది.
కొత్త ధరలు ఎలా ఉంటాయంటే..
ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) బాటిల్ గరిష్ట ధర రూ 150.50 గా ఉంటే.. దాన్ని రూ 160కి పెంచి వసూలు చేస్తారు. క్వార్టర్ బాటిల్ ధర 90.50గా ఉంటే ఏపీఎఫ్ కలిపి దాని ధర 100 రూపాయలు అవుతుంది. క్వార్టర్ మద్యం ధర రూ 99 గా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రూ 100 ధరగా ఉంటే అందులో రూపాయిని మినహాయించి రూ 99కే విక్రయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.


Read More
Next Story