
లిక్కర్ స్కామ్–పోలీసు కస్టడీకి ఆ నలుగురు
రెండు రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సిట్ అధికారులు వీరిని విచారించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో మరో మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, మాజీ సలహాదారు రాజ్ కసిరెడ్డితో పాటు భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను శుక్రవారం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ఏ1 నిందితుడుగా రాజ్ కసిరెడ్డి, ఏ31 నిందితుడుగా ధనుంజయరెడ్డి, ఏ32 నిందితుడుగా కృష్ణమోహన్రెడ్డి, ఏ33 నిందితుడుగా బాలాజీ గోవిందప్ప ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వీరు విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. విచారణ కోసం వీరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు వీరిద్దరి విచారణ చేపట్టనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సిట్ అధికారులు వీరిని విచారించనున్నారు.
తొలుత విజయవాడ జైల్లో ఉన్న వీరిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారిని విజయవాడ సీపీ కార్యాలయంలోని సిట్ విచారణ విభాగానికి తరలించారు. దాదాపు ఏడు రోజుల పాటు విచారణకు వీరిని అప్పగించాలని సిట్ అధికారులు కోర్టును కోరారు. అయితే రెండు రోజుల పాటు విచారణకు అప్పగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణకు అనుమతులిచ్చింది.
Next Story