రెండు సబ్జెక్టుల్లోనే ఫెయిలైన లక్షలమంది ఇంటర్ విద్యార్ధులు
x
Intermediate Students

రెండు సబ్జెక్టుల్లోనే ఫెయిలైన లక్షలమంది ఇంటర్ విద్యార్ధులు

ఈమధ్యనే విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో ప్రభుత్వజూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులు ఎక్కువగా ఫెయిలయ్యారు


ఇంటర్మీడియట్ ఫలితాలపై ప్రభుత్వ ఉన్నతాధికారులు పోస్టుమార్టమ్ మొదలుపెట్టారు. ఈమధ్యనే విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో ప్రభుత్వజూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులు ఎక్కువగా ఫెయిలయ్యారు. ప్రైవేటు కాలేజీలు(Private Colleges), గురుకుల కాలేజీలు మంచి ఫలితాలు సాధించగా ప్రభుత్వ కాలేజీలు మాత్రమే ఫలితాల్లో బాగా నిరసపరిచాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకులాలు ప్రైవేటు కాలేజీలకన్నా మెరుగైన ఫలితాలు సాధించాయి. ఈవిషయమై ఇంటర్మీడియట్ బోర్డు(Intermediate Board) సెక్రటరీ కృష్ణ ఆదిత్య సమీక్షలు మొదలుపెట్టారు. ప్రైవేటు కాలేజీలు, గురుకుల కాలేజీల ఫలితాలతో ప్రభుత్వకాలేజీల ఫలితాలను పోల్చిచూస్తున్నారు. లోపాలు ఎక్కడున్నాయనే విషయమై సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా కాలేజీల ఫలితాల వివరాలను సేకరిస్తున్నారు.

ఇప్పటివరకు జరిగిన సమీక్షల్లో తేలింది ఏమిటంటే పరీక్షరాసిన విద్యార్ధుల్లో సుమారు 1.82 లక్షల మంది ఫెయిలయ్యారు. ఫెయిలైన వారిలో కూడా అత్యధికమంది ప్రభుత్వ కాలేజీ విద్యార్ధులే. ప్రైవేటు కాలేజీల విద్యార్ధులు 3.34 లక్షలమంది మొదటిసంవత్సరం పరీక్షలు రాస్తే 2.33 లక్షలమంది విద్యార్ధులు పాస్ అయ్యారు. ప్రభుత్వ కాలేజీల్లో 68 వేలమంది పరీక్షలు రాస్తే 29వేలమంది పాస్ అయ్యారు. ఇక సెకండ్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రైవేటు కాలేజీల్లో 3.46 లక్షలమంది పరీక్షలు రాస్తే 2.28 లక్షలమంది పాస్ అయ్యారు. ప్రభుత్వ కాలేజీల్లో 74 వేలమంది పరీక్షలకు హాజరైతే 39,630 మంది పాసయ్యారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రైవేటు కాలేజీల్లో లక్షలమంది చదివి పరీక్షలు రాశారు, అలాగే ఫెయిలయ్యారు. ప్రభుత్వ కాలేజీల్లో రాసింది వేలమంది, ఫెయిలైంది కూడా వేలమందే.

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫెయిలైన వారిలో అత్యధికులు ఇంగ్లీషు, మాథ్స్ సబ్జెక్టుల్లోనే ఫెయిలైనట్లు సమీక్షల్లో తేలింది. పైరెండు సబ్జెక్టుల్లో కేవలం ఒక్కంటే ఒకే ఒక్కమార్కుతో తేడాతోనే 1.82 లక్షలమంది ఫెయిలయ్యారు. ఉదాహరణకు ఒక విద్యార్ధికి మ్యాథ్స్ సబ్జెక్టులో 35 మార్కులు వస్తే పాస్ అవుతాడు. అయితే వచ్చింది 34 మాత్రమే. లెక్కలు సరిగా చేయలేక, ఇంగ్లీషు గ్రామర్ లో తేలికైన ప్రశ్నలకు కూడా సరైన జవాబులు ఇవ్వలేకనే లక్షలమంది విద్యార్ధులు ఒక్కమార్కు తేడాలోనే ఫెయిలయ్యారు. మ్యాథ్స్ లో ఫంక్షన్స్, మెట్రిక్స్, అడిషన్ ఆఫ్ వెక్టార్స్, వెక్టార్ ప్రోడక్ట్స్ చాప్టర్ లో ఇచ్చిన ప్రశ్నలకు 5 వేలమంది సమాధానాలు రాయలేకపోయారు. మధ్యస్ధంగా ఉన్న ప్రశ్నలకు మరో 12 వేలమంది సరైన జవాబులు రాయలేకపోయారు. కాస్త కష్టంగా ఉన్న ప్రశ్నలకు 80 శాతంమంది విద్యార్ధులు అసలు సమాధానాలే రాయలేదని తేలింది.

ట్రిగ్నామెట్రీ, స్ట్రైట్ లైన్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, డెఫినిషన్స్ అంశాల్లో ఇచ్చిన ప్రశ్నలకు ప్రభుత్వ కాలేజీల విద్యార్ధుల్లో 40 శాతం మంది సమాధానాలు రాయలేకపోయారు. ఇక ఇంగ్లీషు సాధారణ గ్రామర్ లో ఇచ్చిన ప్రశ్నల్లో ప్రభుత్వ కాలేజీల విద్యార్ధులు 53 శాతం సరైన సమాధానాలు రాయలేదు. ఇంగ్లీషులో ఫెయిలైన విద్యార్ధుల్లో 78 శాతం గ్రామర్ సరిగా రాయలేకే ఫెయిలయ్యారని సమీక్షల్లో తేలింది. అందుకనే మేనెల 22వ తేదీనుండి జరగబోయే అడ్వాన్స్ డు సప్లిమెంటరీ పరీక్షల్లో పైఅంశాలను దృష్టిలో పెట్టుకుని ఫెయిలైన విద్యార్ధులకు ప్రత్యేకమైన శిక్షణ ఇప్పించాలని సమీక్షల్లో నిర్ణయించారు. దాదాపు 100 కాలేజీల్లో ఫలితాలు చాలా నిరుత్సాహంగా ఉన్నట్లు సమీక్షలో తేలింది. ముఖ్యంగా మెదక్ జిల్లాలో 30 కాలేజీలు, నాగర్ కర్నూలు జిల్లాలో 28, మహబూబాబాద్ జిల్లాలో 31, కామారెడ్డిలో 22 కాలేజీలు, సిద్ధిపేటలో 17 కాలేజీల్లో అత్యంత తక్కువ ఫలితాలు నమోదవ్వటం పట్ల బోర్డు కార్యదర్శి తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఈకాలేజీల్లోని పరిస్ధితులను అధ్యయనంచేసి, ప్రిన్సిపాళ్ళతో మాట్లాడి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలకు పై కాలేజీల్లోని విద్యార్ధులకు ఎలాంటి కోచింగ్ ఇవ్వాలో నిర్ణయించబోతున్నారు. మరి వీళ్ళ ప్రయత్నాలు ఏమవుతుయో చూడాలి.

Read More
Next Story