
అమరావతి మహిళల కేసులో కృష్ణంరాజు అరెస్ట్
అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలు వేశ్యలంటూ వ్యాఖ్యానించిన కేసులో మొదటి నిందితుడు కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు.
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ వీవీఆర్ కృష్ణం రాజును బుధవారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 6న సాక్షి టీవీ డిబేట్ లో అమరావతిలో ఉన్న మహిళలు వేశ్యలని కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. వ్యాఖ్యాతగా జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. అమరావతిలోని మహిళలు వేశ్యలని, అక్కడ ఇంద్రుడు లేడని చేసిన వ్యాఖ్యలపై తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో కృష్టం రాజు మొదటి నిందితుడు కాగా రెండో నిందితునిగా కొమ్మినేని ఉన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావును ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించిన పోలీసులు కృష్ణం రాజు కోసం గాలింపును ముమ్మరం చేశారు.
విజయనగగరం జిల్లా తగరపువలస గ్రామం నుంచి కారులో పారిపోతుండగా విశాఖపట్నం సమీపంలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. విజయవాడ అయోధ్యనగర్ లో ఉంటున్న కృష్ణంరాజు ఇంటికి తాళం వేసి తన స్నేహితుని వద్ద ఉంటున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. పోలీస్ కేసు నమోదైన ఐదు రోజుల్లో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సంఘటన జరిగి ఆరు రోజులైనా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఆగలేదు. మహిళలు ఇప్పటికే పలు చోట్ల సాక్షి కార్యాలయాలపై దాడులు చేశారు. ఏలూరు జిల్లా కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఇంకా పలు చెట్ల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కృష్టంరాజుకు గురువారం వైద్య పరీక్షలు చేయించి నేరుగా కోర్టులో హాజరు పరుస్తారు.