
కొల్లేరును పరిరక్షించుకోవాలి..ప్రజల సమస్యలను పరిష్కరించాలి
కొల్లేరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు.
పర్యావరణపరంగా కీలకమైన కొల్లేరు సరస్సును పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ఇదే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యలను మానవీయ కోణంలో చూసి పరిష్కరించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. కొల్లేరుపై కోర్టు తీర్పులు, నిబంధనలు, కేంద్ర సంస్థల ఆదేశాలు, స్థానిక పరిస్థితులు, పర్యావరణ, కాంటూరు అంశాలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సోమవారం సమీక్షించారు. కొల్లేరు పరిధిలో మూడు లక్షల మంది ప్రజలు ఉన్నారు. కొల్లేరు కాంటూరు పరిధి అంశంలో చాలా కాలంగా వీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొల్లేరు పరిధిలో 20 వేల ఎకరాల జిరాయితీ, డీ పట్టా భూములు ఉన్నాయి. కాంటూరు సమస్య నేపథ్యంలో ముందుగా వీరికి న్యాయం జరిగేలా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సీఈసీ, సుప్రీంకోర్టు ముందు ఉంచి వారిని ఒప్పించాలి. పక్షులు, పర్యావరణంతో పాటు ప్రజలకు కూడా న్యాయం జరిగేలా కార్యాచరణ ప్రారంభించాలి అని సీఎం చంద్రబాబు అన్నారు.