
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం..రంగంలోకి సిట్
సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఎప్పటికి మిస్టరీ వీడుతోందనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తాజాగా మరో సారి తెరపైకొచ్చింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులు వరుసగా మృత్యువాత పడుతుండంతో మిస్టరీగా మారింది. దీనిపైన కూటమి ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. వివేకా హత్య కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులు ఎందుకు మరణిస్తున్నారనే దానిపై నిగ్గుతేల్చేందుకు సిట్ను రంగంలోకి దింపింది. గత కొన్ని రోజులుగా కడప జిల్లా పులివెందులలో పర్యటిస్తూ, విచారణ జరుపుతున్న సిట్ బృందం తాజాగా వివేకా హత్య కేసులో సాక్షుల్లో ఒకరైన కసుమూరు పరమేశ్వరరెడ్డిని శనివారం సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా విచారణకు పిలుస్తారని పరమేశ్వరరెడ్డి సిట్ అధికారుల మీద సీరియస్ అయ్యారు. అయినా పరమేశ్వరరెడ్డి అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.