
"పరకామణి అసలు దొంగ కరుణాకర్ రెడ్డే"
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, సభ్యుడు భానూ సంచలన ఆరోపణ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోని పరకామణి విభాగంలో జరిగిన భారీ చోరీ వ్యవహారం రాష్ట్రంలో మంటలు రేపుతోంది. ఇందులో వైసీపీ హస్తం ఉందని సాక్షాత్తు రాష్ట్రమంత్రి నారా లోకేశ్ ఆరోపించగా తాజాగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పరకామణిలో అసలు నేరస్తుడు మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి అని ఆరోపించారు.
తిరుమల తిరుపతి శ్రీవారి పరకామణిలో నగదు చోరీ కేసులో టీడీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డే గజదొంగ అని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు. ఈ కేసులో కోట్ల రూపాయల నగదు, బంగారం, ఇతర విలువైన ఆస్తులను విజిలెన్స్ పట్టుకున్నా లెక్కలు మాత్రం కొన్నింటికే చూపించారని పేర్కొన్నారు. కొన్ని ఆస్తులను టీటీడీకి అప్పగించి మిగతావి కరుణాకరరెడ్డి కాజేశారని ఆరోపించారు. అంత భారీ కుంభకోణం జరిగితే అప్పటి పోలీసులు, టీడీడీ ఉన్నతాధికారులు తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలతో లోక్అదాలత్లో కేసు రాజీ చేయించారని ఆరోపించారు.
ఈ కేసులో కీలకమైన రవికుమార్ ముందుకొచ్చి, అన్ని వివరాలూ వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నూతన ధర్మకర్తల మండలి ఏర్పడిన పది నెలల నుంచి ఒక్క రూపాయి అవినీతి కూడా లేకుండా నడిపిస్తుంటే.. దీన్ని ఓర్వలేక టీడీడీ ప్రతిష్ఠను, హిందువుల మనోభావాలను కరుణాకరరెడ్డి దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
భానూ ప్రకాశ్ రెడ్డి సంచలన ప్రకటన..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోని పరకామణి విభాగంలో జరిగిన భారీ చోరీపై టీటీడీ సభ్యుడు భానుప్రకాష్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ఒక వీడియోను విడుదల చేశారు. పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి దోచుకున్న దృశ్యాలు అందులో ఉన్నాయని తెలిపారు. దొంగతనానికి వైసీపీ నాయకులు, అధికారుల సహకారం ఉన్నట్లు భానుప్రకాష్రెడ్డి పేర్కొన్నారు.
కోట్లాది రూపాయల విలువైన డబ్బును రియల్ ఎస్టేట్లో పెట్టుబడి చేశారని వివరించారు. "ఓ దొంగ నుంచి మిగిలిన దొంగలు అందరూ స్వామివారి సొమ్మును దోచుకున్నారు.. గత వైసీపీ ప్రభుత్వ హాయంలో తిరుమల స్వామివారి పరకామణిలో వంద కోట్ల దొంగతనం చేశారని" ఆరోపించారు. టీటీడీ చరిత్రలో అత్యంత భారీ దొంగతనం గత ప్రభుత్వంలో జరిగింది అని టీటీడీ సభ్యుడు భానుప్రకాష్రెడ్డి అన్నారు.
"స్వామివారికి భక్తులు ఎంతో భక్తితో కానుకలు హుండీలో వేస్తే వాటిని దోచుకున్నారు.. రూ. 100 కోట్ల పైగా పరకామణిలో దొంగతనం చేశారు. ఈ కేసును హైకోర్టు సీఐడీకి అప్పగించింది.. వచ్చే నెల రోజుల్లో సీల్డ్ కవర్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.. దానికి సంబంధించిన బోర్డు నిర్ణయాలను ఇతర డాక్యుమెంట్లను అన్నిటిని సీజ్ చేయాలని ఆదేశించింది" అని భాను ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.
అప్పట్లో టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్రెడ్డి ఉన్నారని, ఆయన ఈ విషయంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. లోక్ అదాలత్లో రాజీ చేస్తారా..? అప్పట్లో కేసును లోక్ అదాలత్ ద్వారా రాజీకి వెళ్ళారని టీటీడీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. "కేసులో చాలా మంది వైసీపీ ప్రముఖుల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ భాగస్వామ్యలుగా ఉన్నారు, త్వరలోనే వారందరి పేర్లు బయటకు వస్తాయి. త్వరలో ఓ అధికారి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఈ రూ. 100 కోట్ల స్కాంకు సంబంధించిన అన్ని వివరాలను బయట పెట్టబోతున్నారు.. స్వామివారి సొత్తును కీలకమైన ఓ పోలీస్ అధికారి దోచుకోవడమే లక్ష్యంగా పని చేశారు" అన్నారు.
"వైసీపీ నాయకులు అందరికి ఇందులో వాటాలు వెళ్ళాయి.. అప్పటి అధికారులు ఈ సొమ్మును పంచుకున్నారు.. దోచుకున్న సొమ్ములో కొంత తాడేపల్లి ప్యాలెస్ కి చేర్చారని" భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఎవరిని తప్పించడానికి అప్పటి అధికారులు రాజీకి వెళ్లారని ఆయన ప్రశ్నించారు. పోలీసుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా.. రాజీ చేసుకున్నామని టీటీడీ విజిలెన్స్ రిపోర్టులోఉందన్నారు. ఒత్తిడి తెచ్చిన ఆ పోలీసు అధికారి ఎవరో ముందు తేల్చాలని భాను ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. పరకామణిలో పెద్దజీయర్ తరఫున సి.వి.రవికుమార్ అనే వ్యక్తి విదేశీ కరెన్సీని లెక్కించే వారని, కొన్నేళ్లుగా రహస్యంగా దాదాపుగా రూ. 200 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని బయటకు తరలించినట్లు అనుమానాలు ఉన్నాయని భానూ ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు..
Next Story