
జగన్ గురి సోషల్ మీడియాపైనే
ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సోషల్ మీడియాలో పోస్టు చేయాలని జగన్ తన పార్టీ శ్రేణులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ మీడియా తనకు వ్యతిరేకంగా ఉందని, తనను, తన పార్టీని, తన పార్టీ నేతలను డ్యామేజీ చేసేందుకు పని చేస్తోందని భావించారాలో ఏమో కానీ వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోషల్ మీడియా మీదే ప్రధానంగా దృష్టి సారించారు. ప్రధాన మీడియా సహకారం లేకుండా.. సోషల్ మీడియా ద్వారానే తమ కార్యక్రమాలను ప్రచారం చేసుకోవాలని, తద్వారా ప్రజలకు చేరువ కావాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే సోషల్ మీడియాను, స్మార్ట్ ఫోన్లను తమ పార్టీ కార్యక్రమాలకు ఎలా ఉపయోగించుకోవలనే దానిపై తన పార్టీ శ్రేణులకు దిశా నిర్థేశం చేశారు. ఇది సోషల్ మీడియా యుగమని, ఫోన్ ఒక గన్ వంటిదని, దానిని ఆయుధంగా ఉపయోగించుకోవాలని వివరించే ప్రయత్నం చేశారు.
మరో వైపు సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారనే కారణంతో కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలు, కార్యకర్తలపై పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్న సందర్భంలో పార్టీలోని ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో భాగస్వామ్యం కావాలని జగన్ తన పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులతో మంగళవారం జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. స్మార్ట్ ఫోన్ అనేది ఒక గన్ వంటిదని, అలాంటి ఆయుధాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే విషయాల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియాను, స్మార్ట్ ఫోన్లను పార్టీ కార్యక్రమాలకు ఎలా ఉపయోగించుకోవాలో వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా క్లియర్ కట్గా వివరించే ప్రయత్నం చేశారు.
సోషల్ మీడియా ద్వారా తన పార్టీ కార్యక్రమాలును ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, ఎందుకు తీసుకెళ్లాలి, దాని వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభాలు జరుగుతాయి, ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుంది, తద్వారా పార్టీ ఎలా బలపడుతుంది, ప్రజలు పార్టీకి ఎలా చేరువ అవుతారు, పార్టీ నాయకులు, శ్రేణుల మధ్య ఎలాంటి సమన్వయం ఏర్పడుతుంది. ప్రజల సమస్యలపై ఎలా పోరాటాలు చేయాలి వంటి అనేక విషయాలను ఆ పార్టీ శ్రేణులకు వివరించే ప్రయత్నం చేశారు.
సోషల్ మీడియా వేదికగా తమ కార్యక్రమాలను విస్తృతం చేయాలనే ఆలోచనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో భాగస్వాములు కావలసిందే అంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో అకౌంట్లు క్రియేట్ చేసుకోవాలి. యూట్యూబ్, ఎక్స్ వంటి అన్ని సోషల్ మీడియాల్లో చురుకుగా ఉండాలి. ఈ వేదికల ద్వారా ఎప్పటికప్పుడూ స్పందిస్తూ ఉండాలి. ప్రజల్లోకి వెళ్లే క్రమంలో ఎక్కడైనా.. ఎవరికైనా అన్యాయం జరిగినా, సమస్యలు తలెత్తినా, ఎవరైనా అడ్డుకున్నా, వాటికి సంబంధించిన సమాచారాన్ని అటు పార్టీ పెద్దలకు, ఇటు ప్రజలకు చేరవ అయ్యే విధంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టాలని సూచించారు. దీని వల్ల ఏమి జరుగుతోంది, ఎక్కడ అన్యాయం జరిగిందనే దానిపై అందరికీ తెలియడంతో పాటు అందరూ వచ్చి తోడుగా నిలబడేందుకు ఉపయోగ పడుతుందని.. ఇదీ విజన్ అని దీనిని ప్రతి ఒక్కరు తమ ఫాలో కావాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్థేశం చేశారు.
Next Story