జగన్‌ కారు డ్రైవర్‌ రెండో రోజు విచారణ
x

జగన్‌ కారు డ్రైవర్‌ రెండో రోజు విచారణ

రాష్ట్ర వ్యాప్తంగా జగన్‌ కాన్వాయ్‌ కేసు సంచలనంగా మారింది.


మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. జగన్‌పై కేసు నమోదు కావడంతో వైసీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. ఇది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందనే ఆందోళనలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మరో వైపు జగన్‌ కారు డ్రైవర్‌ రమణారెడ్డి ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఆదివారం ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం కూడా విచారణ చేస్తున్నారు. ఈ కేసుపై పూర్తి స్థాయి దృష్టి సారించిన ఆంధ్రప్రదేశ్‌ పోలీసు యంత్రాంగం ఈ కేసుకు సంబంధించి మరిన్ని సాక్ష్యాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. అందులో భాగంగా జగన్‌ కారు డ్రైవర్‌ రమణారెడ్డిని రెండో రోజు తమ అదుపులోనే ఉంచుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన కేసు కావడంతో రాష్ట్ర డీజీపీతో పాటు మరి కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

జగన్‌ ఈ నెల 18న పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జగన్‌ వెళ్తున్న కారు కింద పడి చీలి సింగయ్య అనే వ్యక్తి మరణానికి కారణమయ్యారని జగన్‌ మీద కేసు నమోదు చేశారు. ఈ కేసులో జగన్‌ను ఏ2 నిందితుడగా పోలీసులు చేర్చారు. మరణించిన సింగయ్య భార్య లూర్థుమేరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఎస్‌ఎస్‌లోని సెక్షన్‌ 106(1)కింద తొలుత జగన్‌ మీద కేసు నమోదు చేశారు. తర్వాత వెలువడిన వీడియో ఆధారంగా ఈ కేసులో సెక్షన్లు మార్చారు. కారు కింద సింగయ్య పడ్డాడని తెలిసే ఆయన మరణానికి కారణమయ్యారని జగన్‌పై కేసులు మార్చారు. బీఎస్‌ఎస్‌లోని 105, 49 సెక్షన్ల కింద రెండో దఫా కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో వాహనం నడిపిన జగన్‌ కారు డ్రైవర్‌ రమణారెడ్డిని ఏ1 నిందితుడగా పోలసులు చేర్చారు. జగన్‌ వ్యక్తిగ కార్యదర్శి కే నాగేశ్వరరెడ్డిని ఏ3గాను, ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ఏ4గా, మాజీ మంత్రి పేర్ని నానిని ఏ5గా, మరో మాజీ మంత్రి విడదల రజనిని ఏ6 నిందితులుగా చేర్చుతు కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న జగన్‌ కారు డ్రైవర్‌ పోలీసుల విచారణలో ఏ వివరాలు వెల్లడిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. మరో వైపు సంఘటన జరిగిన జూన్‌ 18న జగన్‌కు రక్షణగా ఉన్న పోలీసు సెక్యూరిటీ సిబ్బందిని కూడా పిలిపించి విచారించి ఈ కేసుకు సంబంధించి మరిన్ని సాక్ష్యాధారాలను సేకరించాలనే ఆలోచనల్లో పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.
Read More
Next Story