ఆ ఘటన నన్ను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది: షర్మిల
x

ఆ ఘటన నన్ను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది: షర్మిల

గుడివాడ మండలం శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల గర్ల్స్ హాస్టల్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాల అంశంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు.


గుడివాడ మండలం శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల గర్ల్స్ హాస్టల్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాల అంశంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఈ విషయం తనను ఎంతో భయాందోళనకు గురి చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఫాస్ట్‌ట్రాక్ విచారణ జరిపించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. చదువు చెప్పే పాఠశాలల్లో కూడా మహిళలకు భద్రత లేకుంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక తల్లిగా ఈ ఘటన నన్ను ఎంతో భయపెడుతోందని, మహిళల భవిష్యత్తు ఏంటన్న సందేహాన్ని కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు ఆమె.


సీనియర్ ఐపీఎస్‌లు విచారించాలి..

‘‘ఆడపిల్లల బాత్ రూముల్లో హెడెన్ కెమెరాలు.. 3వందలకు పైగా వీడియోలు..విషయం బయటకు పొక్కకుండా తగు జాగ్రత్తలు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు ఉండాలి. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన నన్ను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చదవు,సంస్కారం నేర్పాల్సిన విద్యాసంస్థలు.. పిల్లలకు ఏం నేర్పుతున్నాయోనన్న ఆలోచనలో పడేసింది. ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే మరో నిదర్శనం. కాలేజిల్లో పర్యవేక్షణ కొరవడిందనడానికి సజీవ సాక్ష్యం. యాజమాన్యాల నిర్లక్ష్యానికి నిలవెత్తు దర్ఫణం. కాసుల కక్కుర్తి తప్పా.. భద్రత ప్రమాణాలు గాలికొదిలేశారనే దానికి ఈ ఘటనే ఉదాహరణ. ఈ ఘటనపై సాధారణ విచారణ కాదు. ఫాస్ట్రాక్ విచారణ జరగాలి. తక్షణం ఉన్నతస్థాయి కమిటి వేయాలి. సీనియర్ ఐపిఎస్ అధికారులతో విచారణ జరగాలి. బాత్ రూముల్లో కెమెరాలు పెట్టింది ఎవరో వెంటనే తేల్చాలి. రాజకీయ నాయకుడి కొడుకా..కూతురా కాదు.. కెమెరాలు పెట్టింది ఎవరైనా..ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందే. మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే భయపడేలా చర్యలు ఉండాల్సిందే. బాత్ రూముల్లో రికార్డ్ అయిన ఏ వీడియో కూడా పబ్లిక్ కాకుండా చూడాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చేవారం లోపు చర్యలు చేపట్టకపోతే నేను కాలేజీని సందర్శిస్తా. విద్యార్థినిలతో మాట్లాడుతా. వారు కోరుకున్నట్లు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది’’ అని హామీ ఇచ్చారామే.

కఠిన చర్యలుంటాయి: ఎస్పీ

సీక్రెట్ కెమెరాల వ్యవహారంపై కృష్ణాజిల్లా ఎస్పీ స్పందించారు. బాలికల హాస్టల్‌లో ఎలాంటి కెమెరాలు గుర్తించలేదని చెప్పారు. ‘‘నిందితుల ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. వాటిని నిపుణులు పరిశీలిస్తున్నారు. నేరారోపణ చేసే ఏ విధమైన అంశాలు బయటపడలేదు. ఈ విషయంలో విద్యార్థినులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దర్యాప్తును వేగవంతం చేస్తున్నాం. తప్పు చేసిన వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ఆయన వివరించారు.

అధికారులకు లోకేష్ ఆదేశాలు

ఇంజినీరింగ్ కళాశాలలోని గర్ల్స్ హాస్టల్‌ బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ అంశంపై లోతైన దర్యాప్తు జరిపించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదే విధంగా ఇటువంటి ఘటనలు ఏ కళాశాలలో కూడా పునరావృత్థం కాకుండా చర్యలు తీసుకోవాలని, కళాశాల్లో ర్యాగింగ్, వేధింపులపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారన్ని తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కూడా ఆదేశించారు.

Read More
Next Story