ఆంధా యూనివర్శిటీ విద్యార్థుల నూతన ఆవిష్కరణ
x
స్మార్ట్‌ షూ ఇన్సోల్‌ రూపకర్తలు (మధ్యలో షైనీ ధరావత్‌)

ఆంధా యూనివర్శిటీ విద్యార్థుల నూతన ఆవిష్కరణ

మీ గుండె మీద నిఘా వేసే పాదరక్షలు... గవర్నమెంట్ యూనివర్శిటీల్లో కూడా ప్రతిభ ఉందని నిరూపించారు.


గవర్నమెంటు విశ్వవిద్యాలయాలనుంచి మంచి వార్తలు, ఉత్తేజకరమయిన వార్తలు వినక చాన్నాళ్లయింది.వందేళ్లు పూర్తి చేసుకున్న తెలుగు వాళ్ల మహత్తర విశ్వవిద్యాలయం ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఇపుడు ఒక మంచి వార్త వెలువండి. అక్కడి విద్యార్థులు ఒక పరికరం ఆవిష్కరించారు. ఇది గర్వకారణం. ఈ వివరాలేమిటో చదవండి ఇక్కడ....


మీరు ధరించే చెప్పులే మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేస్తాయి. ఈసీజీ, హార్ట్‌ బీట్, బాడీ టెంపరేచర్‌ వంటి వాటిని తేటతెల్లం చేస్తాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ? అవును మీరు చదువుతున్నంది నిజంగా నిజమే. ఈ అద్భుతాన్ని విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం మహిళా ఇంజినీరింగ్‌ కళాశాల సీఎస్‌ఈ విద్యార్థినులు ఆవిష్కరించారు. అదేమిటో తెలుసుకుందాం రండి!



అందరిలా కాకుండా ఏదైనా వినూత్నమైన ఆవిష్కరణ చేయాలన్న సంకల్పం ఆ విద్యార్థినులది. ఆ లక్ష్యంతో ఆంధ్ర యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో నాలుగో సంవత్సరం చదువుతున్న షైనీ ధరావత్‌కు తొలుత ఈ ఆలోచన మొగ్గ తొడిగింది. దానిని తోటి విద్యార్థినులు ఉషశ్రీ, జయప్రియ, జెహెరాలతో పంచుకుని ముందుకు అడుగులు వేశారు. వారి ఆలోచనలకు కాలేజి ప్రిన్సిపాల్‌ ఆర్‌. పద్మశ్రీ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు బి.ప్రజ్ఞ, బి.ఎస్తేరు సునందలు ప్రోత్సాహం అందించారు. వీరి మార్గదర్శకత్వంలో సోల్‌ సెన్స్‌ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.

అనంతరం సోల్‌ సెన్స్‌ అనే సర్క్యూట్‌ను రూపొందించారు. సోల్‌ సెన్స్‌ అనేది ఒక స్మార్ట్‌ షూ ఇన్సోల్‌. దానిని షూ/చెప్పులో (పాదానికి, సోల్‌కి మధ్యలో) అమర్చిన వ్యక్తిలోని ఒత్తిడి, హార్ట్‌ బీట్, ఈసీజీ, శరీర ఉష్ణోగ్రత (బాడీ టెంపరేచర్‌)లను తెలియజేస్తుంది. ఇందుకోసం వేర్వేరుగా నాలుగు ప్రెజర్‌ సెన్సార్లను అమరుస్తారు. పాదాల ఒత్తిడితో ఈ సోల్‌ సెన్స్‌ ఆరోగ్యాన్ని ట్రాక్‌ చేయడం, బ్యాలెన్స్‌ సమస్యలను గుర్తించడం, అవసరమైనప్పుడు సంరక్షుకులను అలెర్ట్‌ చేయడం వంటివి చేస్తుంది. నిమిషానికి ఎన్ని అడుగులు వేస్తున్నదీ? చెబుతుంది.

ఇంకా ఆ వ్యక్తి హార్ట్‌ బీట్, ఈసీజీ, బాడీ టెంపరేచర్‌ వంటివి అసాధారణంగా ఉంటే ఆ సంగతినీ తెలియజేస్తుంది. అంతేకాదు.. అల్ట్రా సోనిక్‌ సెన్సార్ల ద్వారా ఎదురుగా ఉన్న అబ్జెక్ట్స్‌ (వస్తువులు/మనుషులు) సమాచారాన్ని ఇస్తుంది. ఈ సమాచారం పంపేందుకు లోకల్‌ సర్వర్‌ లింకు ద్వారా ఓ వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఈ సర్క్యూట్‌లో నోడ్‌ ఎంసీయూ అనే వైఫై మాడ్యూల్‌ అమర్చారు. దీని సాయంతో ఆ వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని ఆ వెబ్‌సైట్‌లో చూసుకునే వీలుంటుంది. అలాగే స్మార్ట్‌ షూ ఇన్సోల్‌ పరికరాన్ని అమర్చుకున్న వ్యక్తి జీపీఎస్‌ మాడ్యూల్స్‌తో సముద్రమట్టానికి ఎంత ఎత్తులో ఉన్నాడు? అతడున్న అక్షాంశ, రేఖాంశాలు వంటి అంశాలను కూడా తెలియజేస్తుంది. ఆ సమాచారాన్ని జీపీఎస్, జీఎస్‌ఎం మాడ్యూల్స్‌ ద్వారా ఎస్‌ఎంఎస్‌లు వచ్చేలా సాంకేతికతను అభివృద్ధి చేశారు.


విభాగాధిపతి ప్రొఫెసర్‌ ఎస్తేరు సునంద

ఇది ఎవరికి ప్రయోజనం?
ఇది ప్రధానంగా వృద్ధులు, క్రీడాకారులు (అథ్లెట్లు) అనువుగా ఉంటుంది. ఫిజియోథెరపీ, కాళ్లు బెణికిన వారికీ ప్రయోజనకారి అవుతుంది. దీనిని ధరించిన వారి అడుగులు ఎలా పడుతున్నాయి? నడిచే క్రమంలో కాలు మడత పడినా, కింద పడినా దానికి కారణాలు రికార్డవుతుంది. వృద్ధులు, క్రీడాకారులకే కాదు.. అసక్తి ఉన్న ఇతరులు కూడా ఈ సోల్‌ సెన్స్‌ను అమర్చిన చెప్పులను/ షూలను వాడవచ్చు. ఈ స్మార్ట్‌ షూ ఇన్సోల్‌కు రూ.6 వేల వరకు ఖర్చవుతుంది.
కచ్చితత్వానికి ఢోకా లేదు..
ఈ స్మార్ట్‌ షూ ఇన్‌సోల్‌ పరికరం ద్వారా వచ్చే ఫలితాలు బయట ఇతర ల్యాబ్‌లు, ఆస్పత్రుల్లో వచ్చే నివేదికలతో పోల్చుకుంటే దాదాపుగా సరిపోతున్నాయని ఈ ప్రాజెక్టుకు గైడ్‌ చేస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎస్తేర్‌ సునంద ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు. మన్ముందు ఈ పరికరాన్ని మరింత అభివృద్ధి చేసి పలువురికి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. మా విద్యార్ఙినులు ఈ ఘనతను సాధించినందుకు గర్వంగా ఉందన్నారు.
స్మార్ట్‌ షూ ఇన్సోల్‌కు పేటెంట్‌ దక్కింది..
ఈ వినూత్న ఆవిష్కరణకు ఆద్యురాలైన షైనీ ధరావత్‌ది హైదరాబాద్‌ హయత్‌నగర్‌.. ఏయూ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో సీఎస్‌ఈ నాలుగో సంవత్సరం చదువుతోంది. ‘ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఏదైనా కొత్త ఆవిష్కరణ చేయాలన్న ఆలోచన ఫలితమే ఈ స్మార్ట్‌ షూ ఇన్సోల్‌ పరికరం. ఈ సోల్‌ సెన్స్‌ను ఇంటిగ్రెటెడ్‌ చిప్‌గా మార్చే సాంకేతికతపై దృష్టి సారించాం. దీనిని పాదరక్షల్లో సులువుగా అమర్చవచ్చు. దీనివల్ల దీనికయ్యే వ్యయం కూడా తగ్గుతుంది. ఫలితంగా రియల్‌ టైమ్‌లో వీటిని వినియోగించవచ్చు. మా ఈ స్మార్ట్‌ షూ ఇన్‌సోల్‌ పరికరానికి పేటెంట్‌ కూడా వచ్చింది. వీటికయ్యే ఖర్చును భరించడానికి ఏదైనా కంపెనీలు ముందుకు వస్తే బాగుంటుంది’ అని షైనీ ధరావత్‌ ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు.
Read More
Next Story