సమాజం మనకెంతో ఇచ్చింది. బడి ద్వారా ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఉంది. క్లాస్ రూం నుంచే దేశ భవితను మార్చవచ్చని నమ్మిన వ్యక్తి సీఎం చంద్రబాబు. విద్య వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావాలి. ఈ వ్యవస్థను మరింతగా బలోపేతం చేయడానికి అందరూ కలిసి పని చేయాలి. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి. దీనికి విద్యా విధానం మెరుగవడం అత్యంత అవసరం. చిన్నప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే భయమేసేది. విద్యా విలువలను పెంపోందించేందుకు చాగంటి కోటేశ్వరరావుతో ప్రవచనాలు ఇప్పించాం. తల్లికి చెప్పలేని పనిని ఎప్పుడూ చేయకూడదని చాగంటి చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి... ఇది మన బాధ్యత. పిల్లల కోసం... పిల్లలకు అర్థమయ్యే విధంగా బాలల రాజ్యాంగం రూపొందించాం. పిల్లలతో మాక్ అసెంబ్లీని నిర్వహించాము. ఎమ్మెల్యేల కంటే అద్భుతంగా సమస్యలపై చర్చించారు అని లోకేష్ అన్నారు.
మహిళలను కించపరిచే విధంగా కొన్ని వాడుక పదాలు ఉన్నాయి. వాటిని ఎప్పుడూ వాడొద్దు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. గతంలో ఇంటి పనులు మహిళలే చేసే విధంగా పాఠ్యాంశాల్లో ఫొటోలు ఉండేవి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి పనులు మహిళలతో పాటు మగవారు కూడా చేస్తున్నట్టుగా ఫొటోలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. క్లిక్కర్ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నాం. పైలెట్ ప్రాజెక్టుగా భామిని మోడల్ స్కూల్లోనే అమలు చేస్తున్నాం. ఫిన్లాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో విద్యా విధానాన్ని పరిశీలించేందుకు టీచర్లను, విద్యార్థులను పంపుతాం. లీప్ యాప్ అందుబాటులోకి తెచ్చాం. దీని గురించి తల్లిదండ్రులకు లీప్ యాప్ గురించి తెలియచెప్పేలా చేస్తాం. పిల్లలు ఎలా చదువుకుంటున్నారో అనే విషయాన్ని తల్లిదండ్రులు నేరుగా లీప్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
భారత దేశంలో ఆంధ్ర మోడల్ విద్యా విధానాన్ని రెండేళ్లల్లో తీసుకురావాలని సీఎం ఆదేశించారు. దీన్ని నెరువెరుస్తామని హామీ ఇస్తున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నా వెనుకుండి నాకు సలహలు ఇస్తున్నారు. విద్యా విధానంలో తీసుకురావాల్సిన మార్పులు, సంస్కరణలు, పిల్లలకు అందించే భోజనం వంటి అంశాల్లో నిత్యం చర్చించుకుంటాం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మేమంతా కలిసి టీమ్ వర్క్ తో పని చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలంటే చిన్నచూపు వద్దు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చండి. మట్టిలో మాణిక్యాలను వెలికి తీద్దామని మంత్రి నారా లోకేష్ తల్లిదండ్రులకు సూచించారు.