పోలవరంకు అంతర్జాతీయ నిపుణుల బృందం
x

పోలవరంకు అంతర్జాతీయ నిపుణుల బృందం

అక్కడ జరుగుతున్న పనుల తీరును పరిశీలించడంతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.


అంతర్జాతీయ నిపుణులతో కూడిన బృందం మరో సారి పోలవరం ప్రాజెక్టును సోమవారం సందర్శించింది. ప్రస్తుతం జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులను ఈ నిపుణుల బృందం పరిశీలించింది. ఈ పర్యటనలో నిపుణుల బృందం ఇరిగేషన్‌ అధికారులకు నిర్మాణం చేస్తున్న సంస్థలకు, పనులకు సంబంధించిన సూచనలు, సలహాలను ఇవ్వనున్నారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌ పనులతో పాటు ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పటిష్టతపైన కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రిచర్డ్‌ డొన్నెల్లి, సీన్‌ హించ్‌ బెర్జర్, జియాన్ఫ్రాన్కో డీ సీకో, డేవిడ్‌ బీ పాల్‌తో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ టీమ్‌ సభ్యులతో పాటు పీపీఏ మెంబర్‌ సెక్రెటరీ ఎం రఘురాం, కేంద్ర జలవనరుల సంఘం అధికారులు, సరబ్జిత్‌ సింగ్‌ భక్షి, రాకేష్, అశ్వనీకుమార్‌ వర్మ, గౌవర్‌ తివారీ, హేమంత్‌ గౌతమ్, సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ అధికారులు మనీష్‌ గుప్తా, లలిత్‌ కుమార్‌ సోలంకి ప్రస్తుతం జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు పనుల తీరుపైన సమీక్షించారు. ఈ సమీక్షలో ప్రాజెక్టు సీఈ కే నరసింహమూర్తి, ఎంఈఐఎల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి సతీష్‌బాబులు ప్రాజెక్టు పనుల పురుగోతిపై వివరించారు.
గతంలో పలుమార్లు అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఈ బృందం డయాఫ్రం వాల్, కాఫర్‌ డ్యామ్‌లపై పరిశీలించి ప్రభుత్వానికి నివేదికను కూడా అందజేసింది.
2014లో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తెరతీసింది. తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దానిని పక్కన పెట్టింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలు 2022లో చోటు చేసుకున్న వరదల నేపథ్యంలో దెబ్బతిన్నాయి. టీడీపీ ప్రభుత్వం డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం సరిగా చేపట్టలేదని, దీని వల్ల అది దెబ్బతినిందని, ఈ నేపథ్యంలో పోలవరం నిర్మాణం కొనసాగించడం కష్టమని నాడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని పక్కన పెట్టింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి దీనిని తెరపైకి తెచ్చారు.
Read More
Next Story