
కృష్ణమ్మ ఉరకలు..గోదావరి ఉగ్రరూపం
రెండు నదుల్లో భారీ స్థాయిలో వరద నీటి ప్రవాహం వచ్చి చేరుతుండటంతో ఇన్ఫ్లోతో పాటు ఔట్ ఫ్లో కూడా భారీగా పెరుగుతోంది.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదితో పాటు గోదావరి నదికి పెద్ద ఎత్తున వరద నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో కృష్ణా, గోదావరి నదులు పొంగిపోర్లుతున్నాయి. ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ అండ్ ఔట్ ఫ్లోలు 5.04 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను రెండు రోజుల క్రితం జారీ చేశారు. ఇది నేటికీ కొనసాగుతోంది.
నాగార్జునసాగర్ జలాశయానికి కూడా పెద్ద ఎత్తున వరద నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. దీని వల్ల 26 గేట్లను ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 3.92,997 క్యూసెక్కులు వరకు ఉండగా, ఔట్ఫ్లో 4,73,053 క్యూసెక్కుల వరకు ఉంది. దీంతో పాటుగా శ్రీశైలం జలాశయానికి కూడా భారీ వరద నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం డ్యామ్ వద్ద భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. 4,98,022 క్యూసెక్కుల వరకు ఇన్ఫ్లో ఉండగా, 5,13,540 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.
మరో వైపు గోదావరి కూడా ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద 50.3 అడుగుల వరకు నీటిమట్టం చేరుకుంది. ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్ ఫ్లో 9.75 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఈ నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదీ పరివాహక/లంకగ్రామ/లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ పేర్కొన్నారు.
Next Story