
’ఎవరికైనా చెబితే ఎన్కౌంటర్ చేస్తాం‘
పోలీసు అధికారి పేరుతో బెదిరింపులు పాల్పడిన సైబర్ నేరగాళ్లు బద్వేలు న్యాయవాదికి రూ. 72 లక్షలకు పైగా టోకరా పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ అరెస్ట్ మోసాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. బెదిరింపులకు భయపడి చాలా మంది వారి బారిన పడి బాధితులుగా మిగులుతున్నారు. లక్షలలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కొంత మంది పోలీసులను ఆశ్రయిస్తుంటే మరి కొంత మంది బాధితులు పరువు పోతుందని మిన్నకుండి పోతున్నారు. అలాంటి సంఘటనే కడప జిల్లాలో చోటుచేసుకుంది. వైఎస్సార్ కడప జిల్లా, బద్వేలుకు చెందిన ప్రముఖ న్యాయవాది ఒకరు సైబర్ మోసగాళ్ల (Cyber Crooks) వలలో చిక్కి, భారీగా నగదు పోగొట్టుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మోసగాళ్లు తాము పోలీసు అధికారులుగా నటించి, క్రిమినల్ కేసులతో బెదిరించి, బద్వేలు పట్టణానికి చెందిన న్యాయవాది నుంచి ఏకంగా రూ. 72,68,039 ను కాజేశారు.
మోసం జరిగిన తీరు
నకిలీ కాల్ (Spoof Call): సుమారు 3 నెలల కిందట, గుర్తు తెలియని వ్యక్తి న్యాయవాదికి ఫోన్ చేశాడు. తాను గుజరాత్కు చెందిన పోలీసు అధికారినని పరిచయం చేసుకున్నాడు.
ఆధార్ బెదిరింపు: న్యాయవాది ఆధార్ నంబర్కు లింక్ అయిన ఒక ఫోన్ నంబర్ ద్వారా అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని, దీనిపై ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదైందని నమ్మబలికాడు.
వారెంట్ బెదిరింపు: ఆ తర్వాత, సుప్రీంకోర్టు నుంచి న్యాయవాదిపై నాన్బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ అయిందని, తక్షణమే అరెస్టు చేయాల్సి ఉంటుందని బెదిరించాడు.
డబ్బు డిమాండ్: సమస్యను పరిష్కరించాలని న్యాయవాది కోరగా, నేరగాడు మొదట రూ. 18 లక్షలు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశాడు.
బదిలీ: ఆ తర్వాత పలుమార్లు ఫోన్ చేసి బెదిరిస్తూ, వివిధ లావాదేవీల (ట్రాన్సాక్షన్స్) ద్వారా మొత్తంగా రూ. 72,68,039 ను బదిలీ చేయించుకున్నాడు.
ఎన్కౌంటర్ బెదిరింపు: ఈ విషయం బయటకు చెబితే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించడంతో, న్యాయవాది భయపడి ఎవరికీ చెప్పలేదు.
దర్యాప్తు ప్రారంభం
డబ్బులన్నీ పోగొట్టుకున్న తర్వాత ఇదంతా మోసమని గ్రహించిన బాధిత న్యాయవాది పట్టణ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించకుండా ఉండేందుకు మోసపోయిన న్యాయవాది వివరాలను వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు. పోలీసుల హెచ్చరిక: ఇలాంటి 'పోలీసు/సీబీఐ/బ్యాంకు అధికారి' పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ను సైబర్ మోసాలుగా పరిగణించాలి. నిజమైన అధికారులు ఎప్పుడూ ఫోన్లో క్రిమినల్ కేసులు లేదా వారెంట్ల గురించి బెదిరించరని, డబ్బు డిమాండ్ చేయరని పోలీసులు ప్రజలకు సూచించారు.

