ఏపీలో మళ్లీ ఐఏఎస్‌ల బదిలీలు
x

ఏపీలో మళ్లీ ఐఏఎస్‌ల బదిలీలు

మల్లారపు నవీన్‌ను కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గాను, మొగిలి వెంకటేశ్వర్లును నెల్లూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా నియమించారు.


ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మళ్లీ ఐఏఎస్‌ అధికారుల బదిలీలను చేపట్టింది. తొమ్మిది మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీలు చేసింది. వీరిలో పోస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్న 2012వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి ఎస్‌ నాగలక్ష్మిని ఏపీ జెన్‌కో ఎండీగా నియమించారు. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న 2014వ బ్యాచ్‌కు చెందిన మరో ఐఏఎస్‌ అధికారి పి ప్రశాంతిని రిహాబిలిటేషన్, రీసెటిల్‌మెంట్‌ డైరెక్టర్‌గా నియమించారు. పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్న 2015వ బ్యాచ్‌కు చెందిన మరో ఐఏఎస్‌ అధికారి బీఆర్‌ అంబేద్కర్‌ను స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఐజీగా నియమించింది. 2016వ బ్యాచ్‌కు చెందిన చామకుర్తి శ్రీధర్‌ను ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ శాఖ డైరెక్టర్‌గా నియమించారు. ఈయన కూడా పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్నారు.

పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్న 2018వ బ్యాచ్‌కు చెందిన మరో ఐఏఎస్‌ అధికారి అమిలినేని భార్గవ్‌ తేజను ఏపీసీఆర్‌డిఏ అదనపు కమిషనర్‌గా నియమించారు. ఏపీసీఆర్‌డిఏ అదనపు కమిషనర్‌గా ఉన్న మల్లవరపు నవీన్‌ను కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా నియమించారు. పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్న 2019వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి కట్టా సింహాచలంను ఖాదీ బోర్డు(కేవిఐబీ) సీఈఓగా నియమించారు. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న మొగిలి వెంకటేశ్వర్లును నెల్లూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా నియమించారు. బీసీ వెల్పేర్‌ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్‌ మల్లికార్జునను ఏపీ స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్‌ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా పోస్టింగ్‌లు పొందిన ఐఏఎస్‌ అధికారుల స్థానంలో ఇప్పటికే విధులు నిర్వర్తిస్తున్న వారి నియామకాలకు సంబంధించి విడివిడిగా వారికి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఉత్తర్వులో ఆయన పేర్కొన్నారు.

Read More
Next Story