
దుర్గమ్మ సన్నిధిలో ప్రమాణం చేశా..చంద్రబాబు, లోకేష్ చేస్తారా
ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యం కేసు కలకలం రేపుతోంది. వైసీపీ నాయకుల మెడలకు చుట్టుకునే అవకాశం ఉందని చర్చ ఉంది.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ దుమారం రేపుతోన్న నకిలీ మద్యం కేసులో తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ వైసీపీ (YSRCP) నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో సత్యప్రమాణం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ ఎంట్రెన్స్ వద్ద చేరుకున్న ఆయన, చేతిలో దివ్వెను వెలిగించుకుని "ఈ వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం లేదు" అని ప్రమాణం చేశారు. తన వ్యక్తిత్వంపై నిందలు వేసి, కుటుంబాన్ని అవమానపరిచినవారికి అమ్మవారు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు.
సోమవారం ఉదయం జోగి రమేశ్ తన భార్య, పిల్లలతో కలిసి కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఘాట్ రోడ్ ఎంట్రెన్స్ వద్దే ఆగి, దివ్వెను వెలిగించుకుని ప్రమాణం చేశారు. "నా వ్యక్తిత్వంపై నింద వేశారు, నా మనసును బాధపెట్టారు. అందుకే కుటుంబంతో సహా వచ్చాను. నేను ఏ తప్పు చేయలేదని నిండు మనసుతో అమ్మవారి ఎదుట ప్రమాణం చేశాను" అని ఆయన మీడియాకు తెలిపారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి, బెజవాడ దుర్గమ్మలపై ప్రమాణానికి సిద్ధమని ముందుగానే చెప్పిన జోగి, ఈ సవాల్కు కట్టుబడి ప్రమాణం చేశారు. అదే సమయంలో, నార్కో అనాలసిస్ టెస్ట్, లై డిటెక్టర్ టెస్ట్లకు సిద్ధమని పునరుద్ఘాటించారు.
"నకిలీ మద్యం కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు. మరి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఏం చెబుతారు? నాపై తప్పుడు ఆరోపణలు చేసినవాళ్లు సత్యప్రమాణానికి సిద్ధమా? పోనీ.. లై డిటెక్టర్ టెస్టుకైనా వచ్చే దమ్ముందా? కనకదుర్గమ్మ సాక్షిగా వాళ్లు నేను తప్పు చేసినట్లు నిరూపించాలి" అని జోగి రమేష్ మరోసవాల్ విసిరారు. ఈ ప్రమాణం తర్వాత, వైసీపీ కార్యకర్తులు ఆలయంలో "జోగి జిందాబాద్" అని నినాదాలు చేస్తూ ఆయనకు మద్దతు తెలిపారు.

