
'ఆ భాగ్యం నాకు దక్కింది'
జగన్నాథుడు రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని హోం మంత్రి అనిత అన్నారు.
జగన్నాథస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం తనకు దక్కిందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. విశాఖపట్నం మహారాణిపేట జగన్నాథస్వామిని శుక్రవారం ఉదయం అనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాయకరావుపేట అసెంబ్లీ నియోజక వర్గంలోని పాండురంగ స్వామి ఆలయం నుంచి విశాఖపట్నం మహారాణిపేటలోని జగన్నాథస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడం తనకు దక్కిన భాగ్యమని, ప్రతీ ఏటా జగన్నాథస్వామిని దర్శించుకోవడం తనకు ఆనవాయితీ అని అనిత తన హర్షాన్ని వ్యక్తం చేశారు.
పది రోజులు పది అవతారాల్లో జగన్నాథస్వామి ప్రజలకు, భక్తులకు దర్శనం ఇవ్వడం, దశావతారాల్లో కొలువైన జగన్నాథస్వామిని దర్శించుకోవడం భక్తులకు మహా భాగ్యమన్నారు. ప్రతి సంవత్సరం తాను జగన్నాథస్వామి ఆశీస్సులు తీసుకుంటానని, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని తాను వేడుకున్నట్లు అనిత వెల్లడించారు. పట్టు వస్త్రాలు సమర్పించేందుకు జగన్నాథస్వామి ఆలయానికి వచ్చిన హోం మంత్రి అనితకు అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. తనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులు అనితకు వేద ఆశీర్వచనం అందజేశారు.