నేనూ బటన్‌ నొక్కొచ్చు..కష్టాలు తెలుసుకునేందుకు వచ్చా
x

నేనూ బటన్‌ నొక్కొచ్చు..కష్టాలు తెలుసుకునేందుకు వచ్చా

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చాకే జాలర్ల దశ దిశ మారిందని సీఎం చంద్రబాబు అన్నారు.


గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాదిరిగానే తాను కూడా అమరావతిలో ఉండే బటన్‌ నొక్కొచ్చని, అలాంటి అవకాశం ఉన్నా తాను అలా కాదనీ, మత్స్యకారుల కష్టాలు తెలుసుకునేందుకే నేరుగా ఇక్కడకు వచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీకాకుళంలో శనివారం ‘మతస్స్యకారుల సేవలో’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు వేట విరామ సమయానికి సంబంధించిన భృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని రూ. 10 వేల నుంచి రూ. 20వేలకు పెంచి మొత్తం రూ. 259 కోట్లను మత్స్యకార లబ్ధిదారుల ఖాతాలో సీఎం చంద్రబాబు జమ చేశారు.

ఈ సందర్భంగా మత్స్యకార గ్రామంలో కలియతిరిగారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజక వర్గం బుడగట్లపాలెంలోని మత్స్యకార కుటుంబాలతో చంద్రబాబు ముచ్చటించారు. మద్దు పోలేష్, రామలక్ష్మి, కారి రాంబాబు, ఉప్పాడ సీతోగ్య, చింతపల్లి ఎర్రయ్య, మద్దు లక్ష్మమ్మ, కారి సీతమ్మ, వారధి పైడమ్మలతో మాట్లాడి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదికలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో 55లక్షల మెట్రిక్‌ టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి అవుతోందన్నారు.


ఈ రంగం ద్వారా ఏపీలో 16.50లక్షల మందికి ఉపాధి లభిస్తోందన్నారు. భవిష్యత్‌లో చేపలకు మరింత డిమాండ్‌ పెరుగుతుందన్నారు. సమాజంలో వెనుకబడిపోయిన వర్గాల్లో మత్స్యకారులు ఉన్నారని, సముద్రాన్నే నమ్ముకుని బతుకుతున్నారని, మీ జీవన ప్రమాణాలు పెంచేందుకు పని చేస్తానన్నారు. దాదాపు 61 రోజులు వేట విరామ సమయంలో మత్స్యకారులను ఆదుకోవాలని 2014–19లో కూడా మత్స్యకార భరోసాను ఇచ్చామన్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ఎక్కడికి పోయినా శ్రీకాకుళం కాలనీ ఉంటుంది. దేశ సరిహద్దుల్లో రక్షణ సైన్యంలో కూడా శ్రీకాకుళం జవాన్లే అధికంగా ఉన్నారు.

ఏపీలో తలసరి ఆదాయం తక్కువుగా వచ్చేది శ్రీకాకుళం జిల్లాలోనే. ఈ జిల్లాను మరింత బాగు చేస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. మత్స్యకార కుటుంబాలకు వేట విరామ సమయంలో రూ. 20 చొప్పున 1,29,178 కుటుంబాలకు రూ. 259 కోట్లు లబ్ధి చేకూర్చినట్లు చెప్పారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేదుకు 9 పిప్పింగ్‌ హార్బర్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఏడాదిలోగా వాటిని పూర్తి చేస్తామన్నారు. మత్స్యకార పిల్లలను బాగా చదివించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఇప్పటికే 6 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. గతంలో ఎర్రన్నాయుడు ఆధ్వరంలో ఉద్దానం ప్రాంతానికి నీళ్లు సాధిస్తే.. రామ్మోహన్‌ నాయుడు ఆధ్వర్యంలో ఇప్పుడు భోగాపురం ఏయిర్‌ పోర్టు పూర్తి కాబోతుందని చెప్పారు.

Read More
Next Story