పేదవారికి సహాయం చేయడంలో వచ్చే సంతోషం అంతా ఇంతా కాదని, అలాంటి ఆనందం ఏ పనిలోను కనిపించదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తమది పేదల ప్రభుత్వమని, పేదలు ఎక్కడుంటే అక్కడకెళ్లి పెన్షన్లు అందించే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని, రాష్ట్ర వ్యాప్తంగా దీనిని అమలు చేస్తున్నట్లు చంద్రబాబు అన్నారు. శనివారం కోనసీమ జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరులో సీఎం చంద్రబాబు పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధిక పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ని అన్నారు. ఈ సారి ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 64వేల మందికి ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు అందజేస్తున్నామని, అధికారంలోకి వస్తే రూ. వెయ్యి పెంచుతామని చెప్పామని, ఆ ప్రకారమే పెంచిన వెయ్యితో కలిపి రూ. 4వేలను పెన్షన్ అందిస్తున్నామన్నారు.
పేదలను ఆదుకునేందుకు, వారికి సహాయం చేసేందుకు ముందుకు రావాలని, ఆ మేరకు ఆలోచనలు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపీలు, ఇతర రాజకీయ ప్రతినిధులతో పాటు అధికారులను సీఎం చంద్రబాబు కోరారు. మెగా డీఎస్సీ కింద ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. ఉపాధి కల్పనకు శరవేగంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నాలుగు నెలలకు ఒక సారి ఉచిత సిలిండర్ పథక కింద లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తామన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని, జూన్ నుంచి అన్నదాత సుఖీభవ అమలు చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టామని, మరో రెండు నెలల్లో ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తామన్నారు.
ఈ సందర్భంగా 1996లో సంభవించిన తుఫాన్ బీభత్సాన్ని, తాను చేపట్టిన సహాయక కార్యక్రమాలను సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. సామాజిక న్యాయం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎవరీకీ ఎలాంటి అన్యాయం జరక్కుండా ఎస్సీ వర్గీకరణ్ చేస్తామన్నారు. జూన్ 1 నుంచి రేషన్ డిపోల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని, ఆ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని చెప్పారు. పెన్షన్ల పంపిణీకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్తే ప్రజల సమస్యలు తెలుస్తాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం సులువు అవుతుందన్నారు. ఏదైనా కారణం చేత భర్త చనిపోతే బాధితురాలైన భార్య అనాధగా మిగిలిపోకూడదని, అలాంటి వారికి ఆటోమేటిక్గా పెన్షన్ ఇచ్చేవిధంగా ఏర్పాట్లు చేశామన్నారు. సోలార్ పవర్ మీద అవగాహన పెంచుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్లు అందస్తామని, రూ. 98వేల సబ్సిడీలతో బీసీలకు, రూ. 75వేల సబ్సిడీలతో ఓసీలకు సోలార్ రూఫ్ టాప్లు ఇస్తామన్నారు. ఇది పేదల ప్రభుత్వమని, మీ ప్రభుత్వాన్ని మీరే కాపాడుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నామని వెల్లడించారు.