
కేసీఆర్ ‘మేడిగడ్డ గుట్టు’ను రేవంత్ ప్రభుత్వం బయటపెట్టిందా ?
మేడిగడ్డ బ్యారేజి 7వ బ్లాకులోని మూడు పిల్లర్లు కుంగిపోవటంతో కాళేశ్వరం ప్రాజెక్టు నీటి నిల్వ, వినియోగానికి పనికిరాకుండా పోయిన విషయం అందరికీ తెలిసిందే
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజి రహస్యాన్ని ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం బయటపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి క్యాబినెట్ సమావేశానికి సంబంధమే లేదని తేలిపోయింది. మేడిగడ్డ బ్యారేజి 7వ బ్లాకులోని మూడు పిల్లర్లు కుంగిపోవటంతో కాళేశ్వరం ప్రాజెక్టు నీటి నిల్వ, వినియోగానికి పనికిరాకుండా పోయిన విషయం అందరికీ తెలిసిందే. దీనిమీద బీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీ నేతల మధ్య చాలా రాద్దాంతాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, అవకతవకలపై విచారించేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను ఏర్పాటుచేసింది. ప్రాజెక్టుల నిర్మాణం విషయమై కమిషన్ దాదాపు 13 మాసాలు 115 మందిని విచారించింది. ఫైనల్ రిపోర్టు ఇచ్చేముందు కేసీఆర్(KCR) హయాంలో కాళేశ్వరం నిర్మాణం విషయంలో ఏమి జరిగిందో తెలుసుకునేందుకు అప్పటి క్యాబినెట్ సమావేశం మినిట్స్ ను కావాలని అడిగింది.
క్యాబినెట్ మినిట్స్ ఎందుకు అడిగింది అంటే కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణం క్యాబినెట్ నిర్ణయం ప్రకారమే జరిగిందని కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, బీజేపీ ఎంపీ ఈటలరాజేందర్(Eatala Rajendar) కమిషన్ ముందు వాగ్మూలమిచ్చారు. వీళ్ళ వాదనలో వాస్తవం ఎంతో తెలుసుకునేందుకే క్యాబినెట్ మినిట్స్ కావాలని కమిషన్ అడిగింది. కమిషన్ అడిగిన క్యాబినెట్ మినిట్స్ ను ప్రభుత్వం కమిషన్ కు అందించింది. అందులో ఏముందంటే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాలని క్యాబినెట్ లో ఎప్పుడూ చర్చించలేదని, నిర్ణయం తీసుకోలేదన్న విషయం స్పష్టంగా బయటపడింది. మేడిగడ్డ బ్యారేజి నిర్మాణం కేవలం పరిపాలనా అనుమతితో మాత్రమే జరిగిందని, పనులు మొదలయ్యే సమయానికి అసలు డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) కూడా లేదన్న విషయాన్ని రేవంత్ ప్రభుత్వం బయటపెట్టింది.
మేడిగడ్డలో బ్యారేజి ఎందుకు కట్టాల్సొచ్చింది అని అడిగినపుడు కేసీఆర్, హరీష్(Harish Rao), కేటీఆర్(KTR), ఈటల కమిషన్ తో ఏమి చెప్పారంటే తుమ్మిడిహట్టిలో బ్యారేజి కట్టాలని అనుకుంటే అందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తిన కారణంగానే బ్యారేజీని మేడిగడ్డకు మార్చినట్లు చెప్పారు. అయితే ఇపుడు మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది అన్నమాట కూడా అబద్ధమే అని తేలిపోయింది. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి తుమ్మిడిహట్టి, మేడిగడ్డలో బ్యారేజి నిర్మాణంపై నిర్ణయం తీసుకునేముందే మేడిగడ్డలో బ్యారేజి నిర్మాణానికి రిపోర్టు తయారుచేయమని వాప్కోస్ ను కోరిన విషయం బయటపడింది. మేడిగడ్డ బ్యారేజి నిర్మాణానికి పరిపాలనా అనుమతి ఇచ్చిన ఏడాది తర్వాత అంటే 2017లో మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు రేవంత్(Revanth) ప్రభుత్వం కమిషన్ కు ఇచ్చిన రిపోర్టులో బయటపెట్టింది.
అంటే క్యాబినెట్ సమావేశంలో మేడిగడ్డపై చర్చించే సమయానికే ప్రాజెక్టు నిర్మాణం మొదలైపోయి పనులు ఒకదశకు చేరిపోయాయి. మేడిగడ్డ బ్యారేజి నిర్మాణానికి 2016, మార్చి 1వ తేదీన కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2021లో సవరించిన అంచనాలు రు. 4,631 కోట్ల ఆమోదానికి మాత్రమే కేసీఆర్ ఈ సబ్జెక్టును మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. కేసీఆర్ ఆలోచన ఏమిటో తెలిసిన తర్వాత మంత్రుల్లో ఎవరైనా అభ్యంతరం చెప్పేవాళ్ళున్నారా ? అందుకనే పెద్దగా చర్చ జరగకుండానే సవరించిన అంచనాలకు క్యాబినెట్ ఓకే చెప్పేసింది. తుమ్మిడిహట్టి నుండి బ్యారేజీని మేడిగడ్డకు మార్చినట్లు క్యాబినెట్ కు 2017, అక్టోబర్లో కేసీఆర్ సమాచారం మాత్రమే ఇచ్చినట్లు నీటిపారుదల శాఖ కమిషన్ కు ఇచ్చిన తాజా నివేదికలో స్పష్టంగా చెప్పింది. మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదర్చుకునే ముందే 2015, ఏప్రిల్ 13న కాళేశ్వరం ప్రాజెక్టుకు డీపీఆర్ చేయాలని జీవో 212 జారీచేసినట్లు ఇరిగేషన్ ఉన్నతాధికారులు కమిషన్ కు వివరించారు. రిపోర్టులో జీవోలను కూడా జతచేసినట్లు తెలిసింది.
2016, జనవరి 17న వాప్కోస్ డీపీఆర్ ప్రభుత్వానికి అందించింది. మేడిగడ్డ, సుందిళ్ళు, అన్నారం బ్యారేజీల నిర్మాణానికి రు. 13,598 కోట్లతో పరిపాలనా అనుమతిపై చర్చించిన తర్వాత 2016, మార్చిన రు. 2,594 కోట్లకు అనుమతి ఇస్తున్నట్లు జీవో జారీ అయ్యింది. వాప్కోస్ 2016, జనవరి 17న డీపీఆర్ ఇచ్చినట్లు, దాని ఆధారంగా క్యాబినెట్ లో చర్చించి ఆమోదం చెప్పినట్లు ఎలాంటి రికార్డులు లేవని ఇరిగేషన్ ఉన్నతాధికారులు కమిషన్ కు రిపోర్టులో చెప్పారు. కమిషన్ కు ఇరిగేషన్ శాఖ అందించిన రిపోర్టు ప్రకారం అర్ధమవుతున్నది ఏమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణంపై క్యాబినెట్ లో చర్చించలేదు, ఆమోదం లేదని. కేసీఆర్ నిర్ణయం ప్రకారమే కాళేశ్వరం, మేడిగడ్డ నిర్మాణాలు, స్ధలమార్పిడి జిరగిందని అర్ధమవుతోంది. దీంతో బ్యారేజీ నిర్మాణాన్ని తుమ్ముడిహట్టి నుండి మేడిగడ్డకు మార్చటానికి మహారాష్ట్రప్రభుత్వం అభ్యంతరాలే కారణమన్నది కూడా అబద్ధమని తేలిపోయింది.
నిజంగానే కేసీఆర్ క్యాబినెట్ సమావేశంలో కాళేశ్వరం, మేడిగడ్డపై చర్చించి ఉంటే చర్చ, ఆమోదానికి సంబంధించిన వివరాలు మినిట్స్ లో ఉంటుంది. ముఖ్యమంత్రులు మారచ్చు, క్యాబినెట్ లో మంత్రులు మారచ్చు. కాని కేసీఆర్ హయాంలో క్యాబినెట్ మినిట్స్ అన్నది రేవంత్ ప్రభుత్వంలో కూడా క్యారి అవుతుంది. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్వహించిన మొదటి క్యాబినెట్ సమావేశంలోనే అవసరమైతే అంతకుముందు కేసీఆర్ మంత్రివర్గంలోని మినిట్స్ తెప్పించుకుని చూస్తారన్న విషయాన్ని బీఆర్ఎస్ మరచిపోయింది. క్యాబినెట్ సమావేశం నిర్వహణ, మినిట్స్ తయారి, మంత్రుల సంతకాలు, తీర్మానాలను ప్రతి క్యాబినెట్ సమావేశంలో రికార్డు చేస్తారు. ఇందుకు ప్రత్యేకంగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో ఒక విభాగం, ఉన్నతాధికారులుంటారు.
అవసరమని అనుకున్నపుడు కేసీఆర్ హయాంలో జరిగిన ప్రతి క్యాబినెట్ సమావేశం నిర్ణయాలు, తీర్మానాలు చూడాలని అనుకుంటే అధికారులు అప్పటి ప్రతి క్యాబినెట్ సమావేశం వివరాలను రేవంత్ ముందుంచాల్సిందే. ఇంతచిన్న లాజిక్ కేసీఆర్, హరీష్, కేటీఆర్ మరచిపోయి కాళేశ్వరం, మేడిగడ్డ నిర్మాణాలు క్యాబినెట్ నిర్ణయం ప్రకారం జరిగిందని ఎలాగ చెప్పారో అర్ధంకావటంలేదు. సరే, కేసీఆర్, హరీష్ అంటే తాముచేసిన తప్పులను సమర్ధించుకునేందుకు క్యాబినెట్ మీదకు తోసేశారని అనుకోవచ్చు. కేసీఆర్, హరీష్ చెప్పినట్లే క్యాబినెట్ నిర్ణయం ప్రకారమే కాళేశ్వరం, మేడిగడ్డ నిర్మించినట్లు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఈటల రాజేందర్ కు ఏమొచ్చింది ? పైగా ‘తన మెడను కోసేసినా నిజమే చెబుతాన’ని ప్రకటన విచిత్రంగా ఉంది. మొత్తంమీద కమిషన్ కు ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఇచ్చిన రిపోర్టు ప్రకారం కాళేశ్వరం, మేడిగడ్డ నిర్మాణాలు క్యాబినెట్ నిర్ణయం ప్రకారమే జరిగిందని కేసీఆర్, హరీష్, కేటీఆర్, ఈటల చెప్పింది అబద్ధమే అని తేలిపోయింది. మరిపుడు పీసీ ఘోష్ తన నివేదికలో ఎవరిని తప్పుపడుతు రిపోర్టు అందిస్తారో చూడాల్సిందే.