
గుంటూరు మేయర్ పదవి కూటమి కైవసం
ఎన్నిక తొలుత ఏక పక్షమే అనుకున్నా.. తర్వాత తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మక భావించే మునిసిపల్ కార్పొరేషన్ మేయర్లలో ఒకటైన గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ పదవిని కూటమి కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీపై పైచేయి సాధించి తన వశం చేసుకుంది. కూటమి నుంచి మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్ర, వైసీపీ నుంచి మేయర్ అభ్యర్థిగా పోటీకి దిగిన అచ్చాల వెంకటరెడ్డిపై విజయం సాధించి మేయర్ పదవిని దక్కించుకున్నారు. వైసీపీ అభ్యర్థి వెంకటరెడ్డికి 27 ఓట్లు రాగా, కూటమి అభ్యర్థి రవీంద్రకు 34 ఓట్లు వచ్చాయి. దీంతో కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర మేయర్గా గెలిచినట్లు ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ భార్గవ్ తేజ ప్రకటించారు.
2024 ఎన్నికల తర్వాత గుంటూరు నగరపాలక సంస్థ రాజకీయాలు మారిపోయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ అధికారం కోల్పోవడం, కూటమి అధికారంలోకి రావడంతో ఆ ప్రభావం గుంటూరు నగరపాలక సంస్థపై పడింది. ఇది వరకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన కార్పొరేటర్లు వైసీపీని వీడి కూటమిలోకి వెళ్లిపోయారు. టీడీపీలోకి, జనసేనలోకి వెళ్లిపోయారు. అంతకుముందు వైసీపీకి 46 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 2024 ఎన్నిలక తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో 19 మంది కార్పొరేటర్లు కూటమి గూటికి చేరారు. దీంతో వైసీపీ బలం తగ్గింది. ఈ నేపథ్యంలో గుంటూరు మేయర్గా ఉన్న కావటి మనోహర్ నాయుడు తన మేయర్ పదవికి రాజీనామా చేయడంతో ఆ పదవికి ఎన్నికలు అనివార్యంగా మారాయి. ఈ క్రమంలో సోమవారం మేయర్ పదవికి నిర్వహించారు.
ఆదివారం వరకు గుంటూరు ఏకపక్షమే అనుకున్న గుంటూరు మేయర్ ఎన్నిక ఆ రోజు రాత్రికి ఊహించన ట్విస్ట్ చోటు చేసుకుంది. అప్పటి వరకు పట్టించుకోని వైసీపీ అకస్మాత్తుగా మేయర్ పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకుంది. 30వ డివిజన్ కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డిని అభ్యర్థిగా తెరపైకి తీసుకొచ్చి ఖరారు చేసింది. సోమవారం ఉదయం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. దీనికి తోడు వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేశారు. ఇప్పటికే 37వ డివిజన్ కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్ అయిన కోవెలమూడి రవీంద్ర మేయర్ అభ్యర్థిగా కూటమి నుంచి బరిలో ఉన్నారు. దీంతో మేయర్ ఎన్నిక అనేది ఉత్కంఠగా మారింది. వైసీపీని వీడి కూటమి గూడికి చేరుకున్న కార్పొరేటర్లు కూటమి అభ్యర్థికి జై కొట్టడంతో కూటమి అభ్యర్థి కోవెలమూడి మేయర్ అభ్యర్థి పదవిని కైవసం చేసుకోవడం అనివార్యంగా మారింది.
Next Story