పొగాకు, మామిడి రైతులకు అండగా ఉండాలి
x

పొగాకు, మామిడి రైతులకు అండగా ఉండాలి

రైతులకు ఇబ్బంది కలగకుండా పంట ఉత్పత్తుల కొనుగోలు జరగాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.


పొగాకు, మామిడి తదితర పంట ఉత్పత్తులకు సంబంధించి రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడాలని, వీలైనంత మెరుగైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మామిడి, పొగాకు, కోకో పంటల మద్ధతు ధరతో పాటు వివిధ అంశాలపైఅమరావతి సచివాలయంలో అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ ఏడాది హెచ్డీ బర్లీ పొగాకు 80 మిలియన్‌ కేజీల మేర ఉత్పత్తి వచ్చిందని సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఇప్పటి వరకూ 27 మిలియన్‌ కేజీల మేర విక్రయాలు జరిగినట్టు అధికారులు తెలిపారు. మిగిలిన 53 మిలియన్‌ కేజీల హెచ్డీ బర్లి పొగాకును త్వరగా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. ఇందులో 33 మిలియన్‌ కేజీల పొగాకును 24 కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్టు అధికారులు వివరించారు. మరో 20 మిలియన్‌ కేజీల మేర పొగాకును ఏపీ మార్క్‌ ఫెడ్‌ ద్వారా కొనుగోలుకు ఏర్పాట్లు చేసినట్టు సీఎంకు అధికారులు తెలిపారు. బాపట్ల –3, గుంటూరు––2, పలనాడు –1, ప్రకాశం – 1 కొనుగోలు కేంద్రాలు ద్వారా పొగాకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని.. వీటి ద్వారా రేపటి నుంచే కొనుగోళ్లు ముమ్మరం చేస్తామని అధికారులు సీఎంకి వివరించారు.

పామ్‌ ఆయిల్‌ పై సుంకం తగ్గింపు, మ్యాంగో పల్ప్‌ పై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించే అంశంపై ఇప్పటికే కేంద్రంతో మాట్లాడానని, దీనిపై అధికారులు సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రస్తుతం మామిడికి ఒక్కో కిలోకు రూ.4 చొప్పున అదనంగా మద్ధతు ధర ఇస్తున్నామని.. ప్రాసెసింగ్‌ యూనిట్లు రూ.8కి తగ్గకుండా కొనుగోలు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాదిలో కోకో 12 వేల మెట్రిక్‌ టన్నుల మేర ఉత్పత్తి వచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే 10 వేల మెట్రిక్‌ టన్నుల మేర విక్రయం కూడా జరిగినట్టు తెలిపారు. ప్రతీ రోజూ 80 నుంచి 100 మెట్రిక్‌ టన్నుల మేర కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. జూలై మొదటి వారానికి మిగిలిన ఉత్పత్తిని కూడా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా పండ్లకు సంబంధించిన ప్రాసెసింగ్‌ యూనిట్లను మరిన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపోందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అంతర్జాతీయ మార్కెట్‌ కు అవసరమైనట్టుగా ఎగుమతులు పెంచేందుకు అత్యుత్తమ గ్రేడింగ్‌ విధానాలను అమలు చేయాల్సిందిగా సీఎం సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ, ఉద్యాన శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు.
Read More
Next Story