
వీరులు పుట్టిన నేల రాజస్థాన్–ఆంధ్రుల పౌరుషం ఉన్న గడ్డ గోదావరి
అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు శంకుస్థాపన చేశారు.
భారత దేశంలో వీరులు పుట్టిన రాష్ట్రం రాజస్థాన్ అని, అలాంటి నేల నుంచి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆంధ్రప్రదేశ్కు వచ్చారని, ఆంధ్రుల పౌరుషం ఉన్న గడ్డ గోదావరి అని, అలాంటి ఈ నేల స్వభావాన్ని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అర్థం చేసుకుంటారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపడంలో గజేంద్రసింగ్ షెకావత్ సహకారం అందించినట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. అఖండ గోదావరి ప్రాజెక్టుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో కలిసి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ గురువారం శంకుస్థాపన చేశారు.
అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ చరిత్రలో నదీ తీరాల వెంట మానవుని నాగరికత అభివృద్ధి చెందిందన్నారు. గోదావరి తీరం ఆంధ్రుల అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిందన్నారు. డొక్క సీతమ్మకు జన్మనిచ్చిన నేల గోదావరి అని అన్నారు. ఆదికవి నన్నయ్యతో పాటు ఎంతో మంది కళాకారులు, కవులకు గోదావరి నేల జన్మనిచ్చిందన్నారు. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తి అయితే ఈ ప్రాంతంలో టూరిజం పెరుగుతుందని, దీంతో ఏటా నాలుగు లక్షల మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందన్నారు. రూ. 430 కోట్లతో ఆంధ్రప్రదేశ్లో టూరిజమ్కు సంబంధించిన ప్రాజెక్టులను తమ కూటమి ప్రభుత్వం చేపడుతున్నట్లు చెప్పారు.
దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ శక్తి వంతమైన నాయకుల ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి అనేది వేగవంతం అవుతుందన్నారు. ఇలాంటి శక్తివంతమైన నాయకులు, ప్రభుత్వాలు అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను ఉండటమే డబుల్ ఇంజన్ సర్కార్ అంటారని అన్నారు. విదేశాలలో నదీ తీరాలను పర్యాటక ప్రాంతాలుగా డెవలప్ చేశారని, అదేమాదిరిగా అఖండ గోదావరి ప్రాజెక్టును కూడా ప్రముఖ టూరిజమ్ స్పాట్గా తీర్చిదిద్దుతామన్నారు. 2035 నాటికి ఏపీలో పర్యాటక రంగం పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తామన్నారు.
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని, ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాజెక్టుల రూపకల్పనకు, తర్వాదా ఏపీని డెవలప్ చేసేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత దేశంలో పర్యాటక రంగం వేగవంతంగా డెవలప్ అవుతోందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు.
దాదాపు 127 ఏళ్ల క్రితం రాజమండ్రి వద్ద గోదావరి నదిపై హేవలాక్ రైల్వే బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. దీనిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఏపీలో డెవలప్ చేయబోయే వివిధ టారిజమ్ ప్రాజెక్టుల ఫొటో ఎగ్జిబిషన్ను గజేంద్రసింగ్ షెకావత్, పవన్ కల్యాణ్ తిలకించారు. గోదావరి నదీ తీరం రివర్ ఫ్రంట్ వ్యూ పాయింట్ నుంచి అఖండ గోదావరి ప్రాజెక్టును చేపట్టబోయే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.