రాబోయే రోజుల్లో పరకామణికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తా
x

రాబోయే రోజుల్లో పరకామణికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తా

దేవాలయాల్లో వైసీపీ చేసిన పాపాలను తాము మోస్తున్నామని మంత్రి ఆనం పేర్కొన్నారు.


రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి పరకామణి విషయంలో పూర్తి వివరాలను వెల్లడిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. దేవాలయాల్లో వైసీపీ పాలకులు చేసిన పాపాలను తాము మోస్తున్నామని, ఆ పాపాలను కడిగేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సనాతన ధర్మాన్ని పాటిస్తూ పూర్తి శాస్త్రోక్తంగా పూజా కైంకర్యాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఆదివారం కృష్ణా జిల్లా తోట్లవల్లూరులోని తోటల శివాలయంలో స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 361 దేవాలయాల పునర్నిర్మాణం కోసం రూ.500 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

ఖాళీగా ఉన్న దేవాలయ ప్రాంగణాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామని, ఆధ్యాత్మికత, భగవాన్‌ నామస్మరణతో ప్రతి ఒక్కరూ నిత్యం ఆనందంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆనం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని దేవాలయాల్లో పట్టణాల్లోని అన్నా క్యాంటీన్ల వలె ఉచిత అన్న ప్రసాదం అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. గత వైసీపీ పాలనలో ఆధ్యాత్మిక ప్రాంతాల్లో విధ్వంసం జరిగిందని, దేవాలయాల్లో చెప్పుకోలేని తప్పిదాలు జరిగాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తూ, దేవాలయాల్లో సామాన్యులకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆనం స్పష్టం చేశారు.

Read More
Next Story