శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు ఉన్న విశాఖ ఆర్ధిక ప్రాంత అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం అవసరమైన పాలసీలను రూపొందించాలని సూచనలు జారీ చేశారు. సోమవారం సచివాలయంలో జరిగిన విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి సీఎస్ కే.విజయానంద్, ఆర్ధిక, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, పర్యాటక, ఐటీ , మున్సిపల్, పరిశ్రమలు, వ్యవసాయ, ప్రణాళికా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీఈఆర్ ప్రాంతం రాష్ట్రానికి గ్రోత్ హబ్ గా తీర్చిదిద్దే అంశంపై ముఖ్యమంత్రి వివిధ శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేశారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకూ ఉన్న వివిధ జిల్లాలను విశాఖ ఎకనామిక్ రీజియన్ గా అభివృద్ధి చేసే విషయంలో స్థానికంగా ఉన్న ఆర్ధిక వ్యవస్థ, పెట్టుబడులు, ప్రజల జీవన ప్రమాణాలు, సుస్థిరాభివృద్ధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
దీనికి సంబంధించిన ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని సీఎం స్పష్టం చేశారు. మొత్తం ఏడు అంశాల ఆధారంగా వీఈఆర్ గ్లోబల్ ఎకనామిక్ హబ్ గా మారుతుందని సీఎం వ్యాఖ్యానించారు. పోర్టుల ద్వారా కార్గో హ్యాండ్లింగ్ తో పెద్ద ఎత్తున లావాదేవీలు జరగాల్సి ఉందని అన్నారు. శ్రీకాకుళం మూలపేట పోర్టు నుంచి రీజియన్ లోని కాకినాడ పోర్టు వరకూ హింటర్ ల్యాండ్ లోని చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్య ప్రదేశ్ లాంటి ప్రాంతాలకు చెందిన కార్గోను కూడా రవాణా జరిగేలా చూడాలని సూచించారు. మూలపేట పోర్టు నుంచి దుగరాజపట్నం పోర్టు వరకూ షిప్ బిల్డింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యేలా చర్యలు ఉండాలని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం ఉత్తర దక్షిణాది రాష్ట్రాలను కలుపుతున్న ఏపీ ఇక ఈస్ట్ వెస్ట్ కారిడార్ గానూ మారాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 12-15 మాన్యుఫాక్చరింగ్ నోడ్స్ కలిగిన ప్రాంతంగా విశాఖ ఎకనామిక్ రీజియన్ మారుతుందని అన్నారు.
ప్రత్యేకించి ఈ రీజియన్ లో క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి ప్రాజెక్టులపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. విశాఖ లాంటి ప్రాంతాలు నెక్స్ జెన్ ఐటీ డేటా సెంటర్ , ఏఐ ఇన్నోవేషన్ మారుతున్నాయని .. ఈ రీజియన్ లోని ఇతర ప్రాంతాలు జాతీయ, అంతర్జాతీయ హెల్త్ కేర్ హబ్ గా మార్చాల్సి ఉందన్నారు. అలాగే ప్రణాళికా బద్దంగా పట్టణీకరణ- హౌసింగ్ ప్రాజెక్టులు రావాల్సి ఉందన్నారు. పట్టణ ప్రాంతాల్లో స్లమ్ క్లస్టర్ రీడెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా విధానాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
సుస్థిరాభివృద్ధికి దీపస్థంభంగా విశాఖ రీజియన్
విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాంతంలో 100 నుంచి 115 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చేందుకు ఆస్కారం ఉందని సీఎం అన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రకటించిన వివిధ ప్రాజెక్టుల ద్వారా 15 బిలియన్ డాలర్ల మేర, ప్రైవేటు కార్పోరేట్లు, సంస్థల ద్వారా 85 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్టు సీఎం తెలిపారు. ఈ ప్రాంతంలోని పోర్టులను రైల్వే లైన్లతో అనుసంధానం చేయనున్నట్టు వెల్లడించారు. త్వరలోనే ఈ మార్గంలో రైల్వే మార్గాలు నాలుగు లేన్లుగా విస్తరించేందుకు కేంద్రం ప్రణాళికలు చేస్తోందని అన్నారు. ఈ జిల్లాల్లో వచ్చే ప్రాజెక్టులను క్లస్టర్ అప్రోచ్ తో ప్రాజెక్టులను గుర్తించి అభివృద్ధి చేయాలని ఆయా శాఖల అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. స్టేట్ హెల్త్ కేర్ పాలసీతో మెడికల్ టూరిజంను లింక్ చేయాలని సూచనలు చేశారు. ఇదే తరహాలో వివిధ పాలసీలను ఆయా ప్రాజెక్టులకు అనుసంధానించాలన్నారు. మరోవైపు సీఎం అధ్యక్షతన విశాఖ ఎకనామిక్ రీజియన్ అథారిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులు ముఖ్యమంత్రికి ప్రతిపాదించారు. దీనిపై స్పందించిన సీఎం విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి సమగ్రమైన యాక్షన్ ప్లాన్ తయారు చేసి అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.