మాజీ ఎంపీ నందిగం సురేష్‌ మళ్లీ అరెస్టు
x

మాజీ ఎంపీ నందిగం సురేష్‌ మళ్లీ అరెస్టు

నందిగం సురేష్‌ను పోలీసు కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.


బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు నందిగం సురేష్‌ను మళ్లీ పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇసకపల్లి రాజుపై దాడి కేసులో నందిగం సురేష్‌ను అరెస్టు చేశారు. నందిగం సురేష్‌తో పాటు ఆయన సోదరుడు ప్రభుదాసు, ఇతర బంధువులు ఇసకపల్లి రాజుపై దాడికి పాల్పడ్డారని ఇసకపల్లి రాజు కుటుంబ సభ్యులు పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నందిగం సురేషన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

శనివారం రాత్రి ఉద్దండరాయునిపాలెంలోనికి వేగంగా నందిగం సురేష్‌ కారు దూసుకొచ్చింది. మితిమీరిన వేగంతో కారును నడిపిన డ్రైవర్‌ను ఇసకల్లిరాజు మందలించాడు. ఈ విషయం తెలుసుకున్న నందిగం సురేష్‌ అనుచరులు అక్కడికి చేరుకున్నారు. డ్రైవర్‌ను మందలించిన రాజుపై సురేష్‌ అనుచరులు దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా నందిగం సురేష్‌ ఇంటికి బలవంతంగా రాజును లాక్కెళ్లారు. అక్కడ రాజు మీద నందగం సురేష్, అతని అన్న ప్రభుదాసుతో పాటు నందిగం సురేష్‌ బందువులు కూడా రాజుమీద దాడికి పాల్పడ్డారు. గాయాలపాలైన ఇసకపల్లి రాజును వైద్య చికిత్సల కోసం అతని కుటుంబ సభ్యులు మంగళగిరి ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. మంగళగిరి ఎయిమ్స్‌లో బాధితుడు చికిత్సలు పొందుతున్నాడు. ఈ మేరకు బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నందిగం సురేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న అతని అన్న ప్రభుదాసు కోసం, బంధువల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిసింది.
Read More
Next Story