అమరావతికి ఒక్కొక్కటిగా...
x

అమరావతికి ఒక్కొక్కటిగా...

ఏపీ రాజధాని అమరావతికి అన్నీ సమకూరుతున్నాయి. రైల్వేలైన్‌ నిర్మాణానికి కేంద్రం చర్యలు చేపట్టింది. అమరావతి నిర్మాణాలకు నిధులు కేంద్రం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి ఒక్కొక్కటిగా సమకూరుతున్నాయి. నూతనంగా బాధ్యతలు చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వానికి పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నడిపించే శక్తి వచ్చింది. ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి 16 పార్లమెంట్‌ సీట్లు వచ్చాయి. ఎన్‌డీఏకు వీరి అవసరం చాలా ఉంది. పైగా ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎంగా ఇచ్చి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దీనిని కూడా పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం అమరావతి రాజధాని అనే విషయాన్ని స్పష్టం చేస్తూ విజయవాడ నుంచి అమరావతి మీదుగా గుంటూరు లైన్‌లో కలుపుతూ రైల్వే లైన్‌ను మంజూరు చేసింది. ఇందుకు అయ్యే ఖర్చును కూడా కేంద్రమే పూర్తి స్థాయిలో భరిస్తుంది. ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు మధ్య భూసేకరణకు వీలుగా దీనిని ప్రత్యేక ప్రాజెక్ట్‌గా గుర్తిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వారం రోజులైంది. రైల్వేశాఖ ఆఘమేఘాలపై అమరావతి రైలు మార్గానికి అన్ని క్లియరెన్స్‌లు ఇస్తూ భూ సేకరణకు గజిట్‌ విడుదల చేసింది. అమరావతిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టిపెట్టడంతో వెంటనే అక్కడి కొత్త రైల్వేలైన్‌కు క్లియరెన్స్‌లు వచ్చేశాయి. గతంలో రాష్ట్రం వాటా ఇవ్వాలి, భూసేకరణ వ్యయం భరించాలనే కొర్రీలతో కాలయాపన చేసిన రైల్వే ఇప్పుడవేమీ లేకుండా పూర్తిగా తమ నిధులతోనే నిర్మాణానికి ముందుకొచ్చింది.
భూ సేకరణకు లైన్‌ క్లియర్‌
విజయవాడ, గుంటూరు రైల్వే లైన్లకు రాజధాని ప్రాంతాన్ని అనుసంధానం చేసేలా కొత్త రైల్వే లైన్‌ 2017–18లో మంజూరైంది. ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు మధ్య 56.53 కిలో మీటర్ల మేర డబల్‌ లైన్, అమరావతి, పెదకూరపాడు మధ్య 24.5 కిలో మీటర్ల సింగిల్‌ లైన్, సత్తెనపల్లి–నరసరావుపేట మధ్య 25 కిలో మీటర్ల సింగిల్‌ లైన్‌ కలిపి మొత్తం 106 కిలో మీటర్ల మేర కొత్తలైన్‌కు ఆమోదం లభించింది.
పట్టించుకోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
2019లో అధికారం చేపట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ రైల్వేలైన్‌ విషయాన్ని అసలు పట్టించుకోలేదు. మూడు రాజధానుల వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చి అమరావతిలో రాయి కూడా కదల్చలేదు. నిజానికి కేంద్రప్రభుత్వాన్ని రైల్వేలైన్‌ విషయమై అడిగి ఉంటే తప్పకుండా ఈ పాటికి రైల్వేలైన్‌ పనులు పూర్తయ్యేవి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎం కావడంతో రైల్వేశాఖలో కదలిక వచ్చింది. ఈ ప్రాజెక్టులో ఎర్రుపాలెం–అమరావతి–నంబూరు మధ్య 56.53 కిలో మీటర్లు డబల్‌ లైన్‌ బదులుగా మొదట సింగిల్‌ లైన్‌ నిర్మాణానికి సిద్ధమైంది. ఈ లైన్‌కు కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఖమ్మం జిల్లాల పరిధిలోని 450 హెక్టార్ల మేర భూసేకరణ చేయనుంది. సింగిల్‌ లైన్‌ నిర్మాణానికి, భూసేకరణకు కలిపి రూ. 2,600 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది.
కొత్తగా 9 రైల్వే స్టేషన్‌ల నిర్మాణం
ఈ కొత్త లైన్‌ విజయవాడ–హైదరాబాద్‌ లైన్‌లో ఎర్రుపాలెం వద్ద మొదలై, అమరావతి మీదుగా గుంటూరు–విజయవాడ లైన్‌లోని నంబూరు వద్ద కలుస్తుంది. ఎర్రుపాలెం తర్వాత పెద్దాపురం, చిన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరులలో 9 కొత్త రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు. వీటిలో పెద్దాపురం, పరిటాల, అమరావతి, కొప్పురావూరు పెద్దస్టేషన్లు్లగా నిర్మిస్తారు. అమరావతిని ప్రధాన స్టేషన్‌గా ఉంటుంది. ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు రైళ్లు నడుస్తాయి. పరిటాల స్టేషన్‌ వద్ద ఎక్కువ గూడ్స్‌ రైళ్లు నిలిచేలా చర్యలు తీసుకుంటారు. ఈ లైన్‌లో భాగంగా కృష్ణా నదిపై కొత్తపేట–వడ్డమాను మధ్య 3 కిలో మీటర్ల వంతెన నిర్మిస్తారు.
Read More
Next Story