ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద ప్రవాహం
x

ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద ప్రవాహం

మధ్యాహ్నం లోపల మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయాలని అధికారులు చూస్తున్నారు.


భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మళ్లీ విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీ స్థాయిలో వరద నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం పెరగడంతో మూడు రోజుల క్రితం వరకు ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఎగుర వేశారు. తర్వాత వరద నీటి ప్రవాహం తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. మళ్లీ బుధవారం నుంచి వరద నీటి ప్రవాహం పెరుగుతుండటంతో తాజాగా మళ్లీ ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఎగురవేసేందుకు అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరుగుతుండటం, వరద ఉధృతి పెరుగుతున్న క్రమంలో అధికారులు ఈ నిర్ణయానికి వచ్చారు. దీనికి తోడు సుమారు 3.03 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో 69 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సుమారు 2.97లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

ఈ క్రమంలో కృష్ణా నది పరివాహక ప్రాంతపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. నదీ పరివాహ ప్రాంతాల్లో ఉన్న పంట పొలాల్లోకి కూడా వెళ్లొద్దని సూచించింది. అంతేకాకుండా వేటకు వెళ్లకూడదని, ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న లోతట్టు ప్రాంతపు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పెరుగుతున్న కృష్ణానది వరద ప్రవాహం పెరుగుతోందని, ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ఉధృతంగా ఉందని దీని వల్ల మధ్యాహ్నంలోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని ఏపీ నిర్వహణ విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వినాయక నిమజ్జనాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Read More
Next Story