
ఐదు రోజుల పర్యటన..29 కార్యక్రమాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఇదే.
ఐదు రోజుల సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు మొత్తం 29 కార్యక్రమాలకు హాజరు కానున్నారు. అందులో 6 ప్రభుత్వ భేటీలు, 14 వన్–టు–వన్ సమావేశాలు. 4 సందర్శనలు, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 డయాస్పోరా, రోడ్షో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఐటీ, పరిశ్రమలు, అర్బన్ డెవలప్మెంట్, క్రీడలు, నౌకాశ్రయాలు, ఫిన్టెక్ రంగాల్లో అనేక అంతర్జాతీయ భాగస్వామ్య అవకాశాలపై ముఖ్యమంత్రి చర్చలు జరుపుతారు.
పెట్టుబడులు ఆకర్షించడం, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రమోషన్ లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటించనున్నారు. శనివారం రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్కు ప్రయాణమవుతున్న సీఎం.. జూలై 27 ఉదయం 6:25కి సింగపూర్ చాంఘీ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఐదు రోజుల పాటు సింగపూర్లో ఆ దేశానికి చెందిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, నారాయణ, ఉన్నతాధికారులు కూడా సింగపూర్ లో పర్యటించనున్నారు.
27వ తేదీ ఉదయం 6 గంటలకు సింగపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాత తొలి రోజు మధ్యాహ్నం 2:00 గంటలకు ఓవిస్ ఆడిటోరియంలో జరిగే తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి సింగపూర్తో పాటు మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్ తదితర దేశాల నుంచి తెలుగు పారిశ్రామిక వేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడుదారులు, ఉద్యోగులు హాజరవుతారు. ఏపీ ఎన్ఆర్టీ సౌసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘తెలుగు డయాస్పోరా’కు దాదాపు 1,500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. తెలుగు డయాస్పోరా వేదిక నుంచి జీరో పావర్టీ మిషన్ లో భాగమైన పీ 4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలుగు పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలను సీఎం చంద్రబాబు కోరనున్నారు.
విమానాశ్రయం నుంచి బస చేసే హోటల్ కు చేరుకున్న అనంతరం ముఖ్యమంత్రి సింగపూర్ లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో భేటీ కానున్నారు. అనంతరం 11:30 గంటలకు సింగపూర్ లోని ప్రముఖ సంస్థ సుర్బనా జురాంగ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. మద్యాహ్నం 12.30 గంటలకు ఎవర్సెండాయ్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ తన్ శ్రీ డాటో ఏ.కె. నాథన్ తో పెట్టుబడుల అంశంపై చర్చించనున్నారు. సాయంత్రం భారత హైకమీషనర్ నివాసంలో విందు సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు.
రెండో రోజు జూలై 28 తేదీన సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో సుస్థిరాభివద్ధి ప్రణాళికలపై అధ్యయనం కోసం సింగూర్ లోని బిడదారి ఎస్టేట్ ను సందర్శిస్తారు. సస్టైనలబుల్ అర్బన్ డెవలప్మెంట్ పై నిర్వహించే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులో పాల్గొంటారు. సింగపూర్ నిర్మించిన స్పోర్ట్స్ స్కూల్ ను కూడా ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు సందర్శించనున్నారు. పోర్ట్ ఆధారిత పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పోర్టు ఆధారిత ఎకో సిస్టంను పరిశీలించనున్నారు. పెట్టుబడిదారులతో నెట్వర్కింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ – సింగపూర్ బిజినెస్ ఫోరం నిర్వహించే రోడ్షో కార్యక్రమంలోనూ మ్యుమంత్రి పాల్గొ్గంటారు.
జూలై 29 తేదీన ఏఐ సింగపూర్, ఎస్ఐఏ ఇంజనీరింగ్, కేప్పెల్ , జీఐసీ లాంటి ప్రముఖ సంస్థలతో వరుసగా భేటీ కానున్నారు. ఐటీ, ఫిన్ టెక్ బిజినెస్ రౌండ టేబుల్ లో 10కి పైగా అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరుపనున్నారు. అనంతరం సింగపూర్ దేశ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. అలాగే సింగపూర్ మాజీ ప్రధాన మంత్రి లీ హ్సియన్ లూంగ్తో సమావేశం అవుతారు. సింగపూర్ లోని జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ సందర్శించి పారిశ్రామిక అభివృద్ధి మోడల్పై అధ్యయనం చేస్తారు. అలాగే సింగపూర్ లోని ప్రముఖ కంపెనీల సీఈఓల రౌండ్ టేబుల్ సమావేశంలో పోర్టులు, మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు.
జూలై 30 తేదీన సీఎం చంద్రబాబు బృందం కేపిటా ల్యాండ్, సుమితోమో మిట్సుయి బ్యాంక్, టెమసెక్ సంస్థలతో సమావేశం అవుతారు. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో సీఎం భేటీ కానున్నారు. జూలై 31 తేదీ సింగపూర్ హోం మంత్రి కే.షణ్ముగంతో పాటు స్థానిక ప్రతినిధులతో సమావేశం కానున్న సీఎం అదే రోజు రాత్రి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు.
Next Story