
జగన్ కారుకు ఫిట్నెస్ తనిఖీలు
గుంటూరు జిల్లా రవాణా శాఖ అధికారుల నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు.
చీలి సింగయ్య మృతి కేసు దర్యాప్తులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కారు ఏపీ 40 డీహెచ్ 2349ను రవాణా శాఖ అధికారుల నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. రవాణా శాఖకు చెందిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గంగాధర ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం జగన్ కారుకు సంబందించిన ఫిట్నెస్ను తనిఖీలు చేపట్టారు.
ఇటీవల వైఎస్ జగన్మోహన్రెడ్డి రెంటపాళ్ల పర్యటనలో చీలి సింగయ్య అనే వ్యక్తి జగన్ కారుకింద పడిపోయి మృతి చెందాడనే ఆరోపణల మీద గుంటూరు నల్లపాడు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. మృతుడి భార్య లూర్థు మేరి ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని ఏ1గాను, జగన్ను ఏ2 నిందితులుగా పేర్కొంటూ పోలీసులు వారిపైన కేసు నమోదు చేశారు. వీరితో పాటు జగన్ కారులో ప్రయాణిస్తున్న మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజని, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జగన్ పీఏ కేఎన్ఆర్ల మీద కూడా కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో జగన్ ప్రయాణించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అందులో భాగంగా రవాణా శాఖ అధికారుల నేతృత్వంలో జగన్ కారు ఫిట్నెస్కు సంబంధించిన తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో ఎంవీఐ గంగాధర్ ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం జగన్ కారు ఫిట్నెస్ను తనిఖీ చేపట్టారు. ప్రస్తుతం ఈ కారును గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఉంచారు.
Next Story