హైదరాబాద్‌ బ్రౌన్‌ ఫీల్డ్‌ సిటీ అయితే అమరావతి గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీ
x

హైదరాబాద్‌ బ్రౌన్‌ ఫీల్డ్‌ సిటీ అయితే అమరావతి గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీ

ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీలపై ప్రశంసలు కురిపించిన ఫిక్కీ ప్రతినిధులు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు


హైదరాబాద్‌ బ్రౌన్‌ ఫీల్డ్‌ సిటీ అని, ఏపీ రాజధాని అమరావతి గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. రాజధాని అమరావతి అద్భుత నగరంగా మారబోతోందని ,రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు పెట్టాలని ఫిక్కీ ప్రతినిధులను ఆయన కోరారు.బుధవారం విజయవాడలో జరిగిన ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశానికి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మొదట్లో వ్యాపారవేత్తలతో, రాజకీయ నాయకులు మాట్లాడే వారు కాదని తెలిపిన చంద్రబాబు ,ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్తామంటే వెళ్లొదని, అలా వెళ్లడం వల్ల ప్రజల్లో ఒక భావన ఏర్పడుతుందని సూచించే వారన్నారు.తాను మాత్రం పలుమార్లు దావోస్‌కు వెళ్లి, పారిశ్రామికవేత్తతో మాట్లాడి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించానని చెప్పుకొచ్చారు.ఇప్పుడు దావోస్ కు అందరూ సీఎంలు వెళుతున్నారన్నారు. నాటి ప్రధాని పీవీ నరసింహరావు ప్రపంచీకరణ (globalization)కు అనుమతి ఇవ్వడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చక్కబడిందన్నారు.ప్రస్తుతం మనం క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నామన్నారు.
పాలనలో టెక్నాలజీ వినియోగం
ప్రస్తుతం ఏపీ పాలనలో టెక్నాలజీని విరివిగా వినియోగిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. మూడు దశాబ్దాలుగా టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.ఆ క్రమంలో ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్‌లో అందిస్తున్నామని వివరించారు.ఊహించని విధంగా టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయని , క్వాంటమ్‌ వ్యాలీ, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇప్పుడు ట్రెండింగ్‌‌లో ఉన్న అంశాలని ఆయన వివరించారు.ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్(AI)‌తో అద్భుతాలు జరుగుతాయని తెలిపారు. కాంపిటేటివ్ ఎకానమీలో మనం ముందుకు వెళ్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందని సీఎం చంద్రబాబు వివరించారు.
పూర్తిగా సహకరిస్తాం-ఫిక్కీ
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు,అమలు చేస్తున్న పాలసీలు ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంటున్నాయని ఫీక్కీ ప్రతినిధులు ఈ సందర్భంగా ప్రశంసించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047దిశగా తమ వైపు నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రభుత్వానికి ఫిక్కీ జాతీయ కార్యవర్గం హామీ ఇచ్చింది.ఎంఎస్ఎంఈ (MSME)ల విషయంలో చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను వారు అభినందించారు.


Read More
Next Story