
ఏపీ బీజేపీ పీఠం ఎక్కిన తొలి తండ్రీ తనయులు!
నలభై ఐదేళ్ల క్రితం పీవీ చలపతిరావుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పగ్గాలు దక్కాయి. ఇప్పడు ఆయన తనయుడు మాధవ్కు మళ్లీ అదే పదవి వరించింది.
పీవీఎన్ మాధవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పీఠం ఎక్కబోతున్నారు. గతంలో ఆయన తండ్రి పీవీ చలపతిరావు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు బీజేపీ అధ్యక్ష పదవిని అధిరోహించారు. ఇలా బీజేపీలో తండ్రీ కొడుకులు రాష్ట్ర అధ్యక్షులు కావడం, అదీ ఉత్తరాంధ్ర వాసులే అవడం మునుపెన్నడూ జరగలేదు. 1980 నుంచి 1986 వరకు చలపతిరావు ఆరేళ్ల పాటు సుదీర్ఘంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగారు. బీసీ కులానికి చెందిన చలపతిరావు ఆ పార్టీలో సీనియర్ నేతగా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. జాతీయ స్థాయి నేతలతోనూ సత్సంబంధాలను కొనసాగించారు. చలపతిరావుకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. 1945లో ఆయన ఆర్ఎస్ఎస్లో బాల స్వయం సేవక్ (జూనియర్ వాలంటీరు)గా చేరారు. అందులో ఆయన కీలక పాత్ర పోషించారు. 1948లో ఆర్ఎస్ఎన్ను బ్యాన్ చే సే వరకు ఆయన బలమైన సంబంధాలను కలిగి ఉన్నారు. మాధవ్ కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారే. తన తండ్రి మాదిరిగానే మాధవ కూడా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈయన ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలుపొంది శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్లీడర్గా వ్యవహరించారు. ఇలా తండ్రీ కొడుకులిద్దరూ ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్సీలయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులూ అయ్యారు. ఇలాంటి అవకాశాలు అరుదుగా కొందరికే వస్తాయని, అది చలపతిరావు, ఆయన తనయుడు మాధవ్లకు దక్కిందంటూ వారి సామీప్యతలను గుర్తు చేసుకుని పలువురు చర్చించుకుంటున్నారు. పీవీ చలపతిరావు తన కుమారుడితో విశాఖలోనే స్థిరపడ్డారు. చలపతిరావు వృద్ధాప్యంతో 2023 జనవరి 1న విశాఖపట్నంలో మరణించారు.
పీవీఎన్ మాధవ్