
నాడు భక్తులు తిన్నవన్నీ ఫేక్ నెయ్యి లడ్డూలేనా!
తిరుమల లడ్డూ కల్తీ కేసులో వెలుగులోకి చేదు నిజం
-వెలది కృష్ణ కుమార్
తిరుమల లడ్డూ కల్తీ కేసు విచారణ లో చేదు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పట్లో తిరుమల శ్రీవారి సేవకు సరఫరా అయిన నెయ్యి అసలైనది కాదని సిట్ తేల్చేసింది. ఆనాటి సప్లై కంపెనీలు కృత్రిమంగా తయారు చేసి ఫేక్ నెయ్యిని సరఫరా చేశారని సీబీఐ హైకోర్టు కు తెలిపింది.దీంతో భక్తులు ఉలిక్కిపాటుకు గురయ్యారు.
ఏడుకొండలవాడికే నామాలు పెట్టాలని చూశారు.. నెయ్యి కాని నెయ్యి అదే ఫేక్ నెయ్యిని తయారు చేసి తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)కి సరఫరా చేసేశారు. ఆ ఫేక్ నెయ్యితో తయారు చేసిన లడ్డూలనే భక్తులకు పవిత్ర ప్రసాదంగా తినిపించారా... భక్తుల విశ్వాసాలతో నెయ్యి సరఫరా కంపెనీలు ఆడుకున్న వైనం, ఇప్పుడు ఒక్కొటొక్కటిగా బయటకు వస్తోంది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలతో, సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేస్తున్న సిట్ విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కల్తీ దందాకు అసలైన సూత్రధారులు ఎవరన్నది ఇంకా తేలాల్సివున్నా...అప్పట్లో తిరుమలకు ఫేక్ నెయ్యి సరఫరా జరిగిందన్న విషయాన్ని దర్యాప్తు సంస్థ సీబీఐ తేల్చేసింది. సిట్ దర్యాప్తులో తగిన ఆధారాలు కూడా దొరికాయని చెప్పింది. ఈ కేసులో అరెస్టయిన నిందితుల తరపున దాఖలైన బెయిల్ పిటీషన్ల పై విచారణ లో భాగంగా హైకోర్టు కు ఈ విషయాలను సీబీఐ వెల్లడించడం సంచలనంగా మారింది.
హైకోర్టు కు సీబీఐ ఏమి చెప్పింది?
తిరుమల లడ్డూ కల్తీ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక సిట్ దర్యాప్తు లో పలు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచిన సిట్ , కొందరు నిందితులను అరెస్టు చేసింది.వారంతా జ్యడీషియల్ రిమాండ్ లో వున్నారు. ఈ కేసుకు సంబంధించి బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన వారిలో ఏఆర్ డెయిరీ ఎండీ రాజు రాజశేఖరన్ (నిందితుడు-2), భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్ (నిందితుడు-3), విపిన్ జైన్ (నిందితుడు-4), వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్కాంత్ చావడా (నిందితుడు-5) ఉన్నారు.వీరు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టులో సీబీఐ తరఫు న్యాయవాది పీఎస్పీ సురేష్కుమార్ తన వాదన వినిపించారు. సిట్ దర్యాప్తులో వెలుగు చూసిన ఆసక్తికరమైన అంశాలను కోర్టు ముందుంచారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లడ్డూ ప్రసాదం తయారీకి సరఫరా చేసిన నెయ్యి అసలుది కాదని, అది పామాయిల్, రసాయనాలతో తయారుచేసిన నకిలీ నెయ్యి అని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి భోలేబాబా డెయిరీ అని, ఆ సంస్థ టీటీడీ బ్లాక్ లిస్టులో ఉన్నందున ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీలను ముందుపెట్టి ఈ దందా నడిపించిందని వాదనలు వినిపించారు. సిట్ దర్యాప్తు లో ఇందుకు తగిన ఆధారాలు దొరికాయని వెల్లడించారు.భోలేబాబా డెయిరీకి పాలు సేకరించి నెయ్యి ఉత్పత్తి చేసే వ్యవస్థే లేదని, ఈ విషయాన్ని రైతులే స్వయంగా చెప్పారని సీబీఐ తరుపు న్యాయవాది పేర్కొన్నారు. కేవలం పామాయిల్, రసాయనాలు, ఇతర ముడిపదార్థాలతో నకిలీ నెయ్యి తయారు చేసి, ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీల ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలిందని వివరించారు. నిందితులు పలుకుబడి వున్న వ్యక్తులు కాబట్టి సాక్షులను బెదిరించే అవకాశం వుందని , అందుకే బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ వాదన వినిపించింది. ఈ రెండు డెయిరీలతో ఒప్పందం కుదుర్చుకుని పక్కా ప్రణాళిక ప్రకారమే భోలేబాబా డెయిరీ ఈ మోసానికి పాల్పడినట్లు ఆధారాలున్నాయని తెలిపారు. వాట్సప్ గ్రూప్ చాటింగ్ వివరాలను కూడా సేకరించినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సాక్షిగా ఉన్న సంజీవ్ జైన్ 2025 ఏప్రిల్ 7న ఢిల్లీ నుంచి తిరుపతి విమానాశ్రయానికి రాగా, నిందితులు ఆయనపై దాడి చేసి, బెదిరించి, చెన్నై మీదుగా బలవంతంగా ఢిల్లీకి తిప్పి పంపించారని కూడా సీబీఐ న్యాయవాది తెలిపారు.అలాగే, మరో నిందితుడు అశిష్ రోహిల్లా నేరాంగీకార వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధపడగా, అతనికి తెలియకుండానే అతని పేరు మీద హైకోర్టులో పిటిషన్ వేశారని, ఈ విషయాన్ని రోహిల్లా స్వయంగా హైకోర్టు రిజిస్ట్రార్కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారని కోర్టుకు వివరించారు.
నిందితుల వాదన ఏంటి?
నిందితుల తరఫున సీనియర్ న్యాయవాదులు సీవీ మోహన్రెడ్డి, ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఏఆర్ డెయిరీ మాత్రమే టీటీడీతో ఒప్పందం చేసుకుందని, భోలేబాబా, వైష్ణవి డెయిరీల డైరెక్టర్లకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని వాదించారు. తమ క్లయింట్లు గత నాలుగు నెలలుగా జైల్లో ఉన్నారని, దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని, సిట్ చార్జిషీట్ కూడా దాఖలు చేసిందని తెలిపారు. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు సిట్ వద్ద ఉన్నాయని, నిందితులు అనారోగ్యంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. కోర్టు విధించే ఎలాంటి షరతులకైనా కట్టుబడి ఉంటామని, బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు.ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ టీసీడీ శేఖర్ నిందితుల తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు తదుపరి విచారణను జూన్ 17వ తేదీకి వాయిదా వేశారు
దర్యాప్తు లో దూకుడు పెంచిన సిట్..
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ఇప్పటికే కీలక విషయాలను రాబట్టిన సిట్ ..మరింత దూకుడుగా ముందుకు వెళుతోంది. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నను కూడా తాజాగా నోటీసులు ఇచ్చి విచారించింది. సుబ్బారెడ్డి పీఏ నుంచి పలు కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తుండగా, గతంలో విధాన నిర్ణయాలు తీసుకున్న మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డి సహా మరో ఇద్దరు ముఖ్యులకు నోటీసులు ఇవ్వడానికి రెడీ అయింది . నెయ్యి సరఫరా చేసిన కంపెనీలలో సోదాలతో పాటు టీటీడీ అధికారులను విచారిస్తోంది.
ఏదైనా వైసీపీ హయాంలో టీటీడీ(TTD)కి సరఫరా అయిన నెయ్యి ఫేక్ నెయ్యి అని సీబీఐ తేల్చి చెప్పడంతో , ఆ నేతితోనే లడ్డూలు తయారు చేశారా అన్న అనుమానం భక్తులకు ఆందోళనకు గురిచేస్తోంది. భక్తుల మత విశ్వాసాలతో ఆడుకొని, అక్రమార్కులకు సహకరించిన అప్పటి టీటీడీ బాధ్యులకు శిక్ష పడాలని భక్తులు కోరుకుంటున్నారు.