
Elephants attack ఏనుగుల బీభత్సం
తిరుపతి జిల్లాలో ఏనుగులు మరోసారి బీభత్సం
తిరుపతి జిల్లాలో ఏనుగులు మరోసారి బీభత్సం సృష్టించాయి. ఓ రైతును ఏనుగులు తొక్కి చంపడంతో విషాదం నెలకొంది. జనవరి 19వ తేది నారావారిపల్లె ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి ని ఏనుగులు తొక్కి చంపడం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు మృతి విషాదాన్ని నింపింది. తాజాగా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ లో ఏనుగులు భీభత్సం చేశాయి. కొత్తపల్లి సమీపంలో పొలం వద్ద పనిచేసుకుంటున్న రైతుపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగులు తొక్కడంతో రైతు చనిపోయాడని స్థానికులు తెలిపారు. శరీరంలోని భాగాలు బయటకు వచ్చి భయానక పరిస్థితి నెలకొందని తోటి రైతులు చెబుతున్నారు. మృతుడ్ని దాసరగూడెనికి చెందిన సిద్దయ్య(65)గా గుర్తించారు. వరుస ఘటనలతో రాత్రివేళతో పాటు పగలు సైతం ఆ ప్రాంతాల్లో తిరగాలంటే రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు.