‘సృష్టి’ వ్యవహారంపై ఈడీ దృష్టి!
x
డాక్టర్‌ నమ్రత

‘సృష్టి’ వ్యవహారంపై ఈడీ దృష్టి!

సరోగసీ పేరిట పిల్లలు లేని దంపతులను మోసం చేసి రూ.కోట్లు గడించిన యూనివర్సల్‌ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ ఎండీ డాక్టర్‌ నమ్రత వ్యవహారాలపై ఈడీ దృష్టి సారించింది.


కొద్ది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న ‘సృష్టి’ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డాక్టర్‌ పచ్చిపాల నమ్రత అలియాస్‌ అత్తలూరి నమ్రత యూనివర్సల్‌ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ పేరుతో ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో ఫెర్టిలిటీ సెంటర్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. సంతానం కోసం పరితపిస్తున్న దంపతులకు సరోగసీ ద్వారా సంతానయోగాన్ని కల్పిస్తానంటూ ఎవరికో పుట్టిన శిశువులను కొనుగోలు చేసి వారికి అమ్ముతున్నట్టు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి.

ఇటీవల రాజస్థాన్‌కు చెందిన దంపతులు గోవింద్‌సింగ్, సోనియాలు డాక్టర్‌ నమ్రత చేతిలో మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సరోగసీ కుంభకోణం బయట పడింది. పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపాక కస్టడీకి తీసుకున్నారు. ఈ కస్టడీలో ఆమె నుంచి కళ్లు బైర్లుగమ్మేలాంటి విషయాలను రాబట్టారు. గడచిన రెండేళ్లలోనే డాక్టర్‌ నమ్రత 80 మంది శిశువులను సరోగసీ ద్వారా విక్రయించినట్టు గుర్తించారు. రెండున్నర దశాబ్దాలుగా ఆమె ఫెర్టిలిటీ సెంటర్లను నడుపుతూ పిల్లలు పుట్టని దంపతుల నుంచి సరోగసీ పేరిట రూ.30–40 లక్షల వరకు వసూలు చేసినట్టు పోలీసులు ఇప్పటికే తమ ప్రాధమిక విచారణలో తేల్చారు.

ఇలా ఈ పాతికేళ్లలో వందల సంఖ్యలో శిశు విక్రయాలు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 80 మంది శిశువుల విక్రయాల ద్వారా రూ.30 కోట్లు వసూలు చేసినట్టు అంచనాకొచ్చారు. దీనిని బట్టి అంతకు ముందు ఇరవయ్యేళ్లలో ఎన్ని కోట్లు వసూలు చేశారనే దానిపై పరిశోధన జరుగుతోంది. ఇంకా ఐవీఎఫ్‌ల పేరిట ఒక్కొక్కరి నుంచి రూ.లక్షలు వసూలు చేశారు.

ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో మనీ ల్యాండరింగ్‌ జరిగినట్టు అనుమానించిన ఎన్ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాజాగా దృష్టి సారించింది. సృష్టి కేసుకు సంబంధించి సమగ్ర వివరాలు అందించాలని హైదరాబాద్, సికింద్రాబాద్‌ గోపాల్‌పురం పోలీసులకు లేఖ రాసింది. సృష్టి ఎండీ డాక్టర్‌ నమ్రత తన అక్రమ సామ్రాజ్యాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు మరో ఆరేడు రాష్ట్రాలకు విస్తరించడంతో ఈడీ రంగంలోకి దిగింది.


ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)

అరెస్టయిన 30 మందిలో 20 మంది వైద్యులే..
సృష్టి కేసులో ఇప్పటివరకు దాదాపు 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 20 మంది వరకు వైద్యులే ఉన్నారు. వీరిలో సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి మత్తు వైద్యుడు, విశాఖ కేజీహెచ్‌ మత్తు విభాగాధిపతి వాసుపల్లి రవి, ప్రసూతి వైద్యురాలు ఉషాదేవి, విశాఖ కేజీహెచ్‌ నుంచి శ్రీకాకుళానికి బదిలీపై వెళ్లిన పిల్లల వైద్య నిపుణురాలు విద్యుల్లత ఉన్నారు. మిగిలిన వారిలో ప్రధాన నిందితురాలు డాక్టర్‌ నమ్రత కుమారుడు జయంత్‌ కృష్ణతో పాటు ఆమెకు సహకరించిన నర్సులు, ఏజెంట్లు, సెంటర్‌ మేనేజర్లు, ల్యాబ్‌ అసిస్టెంట్లు, ఇతరులు ఉన్నారు. వీరందరి నుంచి సేకరించిన సమాచారంతో పోలీసులు ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు.
సృష్టి అక్రమాల్లో డాక్టర్‌ నమ్రతకు సహకరించిన ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో ఏరోజు ఎవరిని అరెస్టు చేస్తారోనన్న భయం నమ్రతతో సంబంధాలున్న డాక్టర్లను వెంటాడుతోంది. విశాఖ ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో 1998లో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్‌ నమ్రత బ్యాచ్‌మేట్లు మరో ఎనిమిది మంది ఉన్నట్టు తేల్చారు.
ఈ కేసులో అరెస్టయిన కేజీహెచ్‌ వైద్యులు రవి, ఉషాదేవి ఈనెల 8 వరకు సెలవు పెట్టారు. ఆ తర్వాత సెలవు పొడిగించాలని కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌కు లేఖలు రాశారు. అయితే వీరిద్దరి సెల్‌ఫోన్లు స్విచాఫ్‌ అయినట్టు వస్తోందని, వీరికి సృష్టి అక్రమాల్లో పాలుపంచుకున్నట్టు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వాణి చెప్పారు.
విదేశాల్లో స్థిరపడ్డ వైద్యులు కొందరు..
మరోవైపు డాక్టర్‌ నమ్రత అక్రమ సరోగసీ వ్యవహారానికి సహకరించిన మరికొందరు వైద్యులు ఇప్పటికే విదేశాల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు సృష్టి బాగోతాన్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులు వారిపై కూడా ఆరా తీస్తున్నారు. గతంలో నమ్రతకు వీరు ఏ మేరకు సహకరించారన్నది తేల్చనున్నారు. దీనిపై నిర్ధారణకు వస్తే వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. డాక్టర్‌ నమ్రత తన అక్రమార్జన సొమ్మును విదేశాలకు తరలించినట్టు అనుమానిస్తున్నారు. ఇలా శిశు విక్రయ ముఠా వెనక మనీ ల్యాండరింగ్‌ జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈడీ రంగంలోకి దిగినట్టు చెబుతున్నారు. రెండేళ్లకు ముందు వరకు మరెన్ని వందల మంది శిశు విక్రయాలు జరిగాయో కూడా నిగ్గు తేల్చనున్నారు. కాగా డాక్టర్‌ నమ్రతను మరోసారి కస్టడీ ఇవ్వాలని గోపాల్‌పురం పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు.
Read More
Next Story