మహాకూటమికి జగన్‌ను ఓడించే సత్తా ఉందా?
x

మహాకూటమికి జగన్‌ను ఓడించే సత్తా ఉందా?

రాజకీయాల్లో ఒకరిపై ఒకరు సద్విమర్శలు చేస్తే ఎవరైనా హర్షిస్తారు. కానీ ఇప్పుడు కువిమర్శలు చేస్తేనే రాణిస్తారు. రాష్ట్రంలో జగన్ ను ఓడించే సత్తా మహా కూటమికి వుందా?


ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుగులేని శక్తిగా ఉన్నాడు. గత ఎన్నికల్లో భారీ మెజారిటీలతో 151 సీట్లలో గెలిచి ఏపీలో తనకు ఎవరు ఎదురు రాలేరని నిరూపించారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒకే మాటపై ఉన్నాయి. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ను ఓడించాలని. జగన్‌ మాత్రం తాను ఒక్కడినే పోటీ చేస్తానని, తమ పార్టీ ఏ పార్టీలతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. పైగా తాము పేదల పక్షమని, తెలుగుదేశం పార్టీ పెద్దల పార్టీ అని ఎన్నికల సభల్లో జగన్‌ ఉపన్యాసాలు ఇస్తున్నారు.

మంచిచే శానంటేనే ఓటు వేయండి..
నేను పేదల పక్షం. వాళ్లు పెద్దల పక్షం. నేను మంచి చేశానని మీరు నమ్మితేనే నాకు ఓటు వేయండి. లేదంటే మీ ఇష్టం అంటూ ఓట్లు అడగటం ఈ ఎన్నికల్లోనే చూస్తున్నాం. అందునా వైఎస్‌ జగన్‌ ఈ విధమైన ప్రచారం చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ఇది పెద్దలకు, పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధంగా వర్ణించారు. ముఖ్యమంత్రి హోదాలో చాలా సార్లు ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అప్పుడప్పుడూ అర్జీలు ఇచ్చి వస్తున్నారు. ఐదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వ తీరును ఒక్కసారి కూడా తప్పు పట్టలేదు. పైగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వస్తున్నారు. అయినా బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ససేమిరా అన్నారు. పీఎంతో పాటు మిగిలిన బీజేపీ పెద్దలు కోరినా పొత్తుకు తాను వ్యతిరేకమని తెగేసి చెప్పారు.
ప్రణాళిక ప్రకారం ప్రచారం..
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ వైఎస్‌ జగన్‌ మాత్రం ఒక ప్రణాళిక ప్రకారం ఆరు నెలల నుంచే ప్రచారం మొదలు పెట్టారు. మూడు నెలల నుంచే అభ్యర్థులను నియోజకవర్గాల్లో నియమించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రకటన వెలువడటానికి ముందే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. వారికి కావాల్సిన మందీ మార్బలాన్ని అందించారు. ప్రతి మండలానికి, వార్డుకు పార్టీ తరపున కన్వీనర్లను నియమించారు. వారే కాకుండా వాలంటీరు పరిధిలో కూడా గృహ సారధులను ఏర్పాటు చేశారు. వీరంతా పార్టీ కోసం పనిచేస్తారు. సిద్ధం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి లక్షల మంది సభలకు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి ఏరియాలోనూ ఈ సభలు జరిగాయి. సభల్లో తాను చేసిన కార్యక్రమాల గురించి చెబుతూ ప్రతిపక్షాలను తూర్బారబట్టే కార్యక్రమం చేశారు. ఆ తరువాత మమంతా సిద్ధం పేరుతో బస్‌ యాత్ర మొదలు పెట్టారు. రాయలసీమ నుంచి ప్రారంభమై మధ్యాంధ్రలో ప్రస్తుతం యాత్ర కొనసాగుతోంది. ఎక్కడికక్కడ అభ్యర్థులు నియోజకవర్గాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు.
ప్రధానమంత్రి మోదీ కూడా జగన్‌పై విమర్శలు చేయడం లేదు
ప్రధాన మంత్రి మోదీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన తరువాత మొదటి సారిగా ఏపీలోని చిలకలూరిపేటలో సభ నిర్వహించారు. ఈ సభలో జగన్‌ మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని అన్నాడే కాని జగన్‌ను మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయకుండా గెలుపు ఎలా సాధ్యమనే విషయాన్ని ప్రధాన మంత్రికి కూటమిలోని వారు ఎవ్వరూ చెప్పే పరిస్థితులు లేవు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు గెలిచినా ఒకటేనని, కూటమిలో తాము గెలిస్తే చాలనుకునే ఆలోచనలో ప్రధాని ఉన్నారు. కేంద్రం నుంచి కూడా జగన్‌పై వత్తిడి లేకపోవడంతో గెలుపు సునాయాసంగానే ఉంటుందనే ధీమాలో ఉన్నాడు. రెండో సారి కూడా త్వరలోనే ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ వస్తున్నారు. ప్రధాని మోదీ తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న రాజమండ్రి, రాజంపేట నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే సభల్లోనే పాల్గొని మాట్లాడతారని ఇప్పటికే బీజేపీ వారు ప్రకటించారు. ఇక కూటమికి విలువేముంటుందనే ఆవేదన తెలుగుదేశం పార్టీలో ఉంది.
కూటమిలో ఎవరి దారి వారిదే..
జగన్‌ను ఓడించాలంటూ బీజేపీ కూటమి కలిసి కట్టుగ ముందుకు సాగాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. పేరుకు మాత్రమే కూటమిగా ఉంది తప్ప ఏవరికి వారే అన్న చందంగా ముందుకు సాగుతున్నారు. బీజేపీని కలుపుకుని ముందుకు పోయేందుకు చంద్రబాబు సైతం సుముఖత చూపడం లేదు. కూటమిగా ఉన్నప్పుడు అందరూ కలిసి ఎన్నికల్లో ఉమ్మడి ప్రచారం చేస్తే దానికి మంచి స్పందన ఉంటుంది. కానీ అదేదీ జరగటం లేదు. చంద్రబాబు తనకు తాను ఒంటరిగానే ప్రచారం చేస్తున్నారు. అప్పుడప్పుడూ పవన్‌కళ్యాణ్‌ కొన్ని సభల్లో ఒక మెరుపు మెరిచి తన దోవన తాను ఉంటున్నాడు. చంద్రబాబు మొదట రా.. కదిలిరా.. సభలు నిర్వహించారు. ప్రస్తుతం ప్రజాగళం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు ఇప్పటికే యువగళం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి సభలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరిలు ఎవరి షెడ్యూల్‌ ప్రకారం వారు సభులు నిర్వహిస్తున్నారు. జనసేన, బీజేపీలు టీడీపీని కలుపుకుని ముందుకు సాగటంలో ఫెయిల్‌ అవుతున్నాయనే వాదన ఉంది.
బీజేపీ అయితే చిన్న చిన్న సభలు సమావేశాలకు మాత్రమే పరిమితమవుతోంది. ఆ పార్టీని పలకరించే ఓటరు లేడంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎప్పటి నుంచో ఆర్‌ఎస్‌ఎస్‌ వాదులుగా ఉన్న వారు మాత్రం నాయకులు ఆయా జిల్లాలకు వెళ్లినప్పుడు పలకరించడానికి వస్తున్నారు. వారిలో కూడా చాలా వరకు అసంతృప్తి ఉంది. దానికి కారణాలు కూడా లేకపోలేదు. బీజేపీ అధికారంలోకి రాగానే ఎర్రకోటపై కాషాయం జెండా ఎగురుతుందని, హిందూ ఆచార సాంప్రదాయాలే రాజ్యాంగం అవుతుందని, నూరు శాతం హిందూ మత వాదులే దేశంలో ఉంటారని, మిగిలిన వారికి ఇక్కడ చోటు ఉండదని అనేకసార్లు తమకు క్లాసుల్లో చెప్పారని, ఇప్పుడు అవన్నీ ఏమయ్యాయని పార్టీ పెద్దలను ప్రశ్నిస్తున్నారు. దీంతో వారికి ఏమి చెప్పాలో దిక్కుతోచని పరిస్థితి ఉంది.
Read More
Next Story