
కుక్క కాట్లకు చనిపోతేనే వీధి కుక్కలు గుర్తుకొచ్చాయా?
కుక్కల నియంత్రణపై ఉన్న చట్టాలను ప్రభుత్వం అమలు చేయడం లేదు. అవి పిల్లలను కరిచి చంపితే కాని ప్రభుత్వంలో కదలిక రాలేదు.
ఏపీలో వీధి కుక్కల బెడద గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. అక్కడక్కడ కుక్కకాట్లు ఎక్కువ కావడంతో ప్రభుత్వం స్పందించింది. ఇటీవల గుంటూరులో ఒక బాలుడిని కుక్కలు కరిచి చంపడంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఏడాదికి రెండు లక్షలపైనే కుక్కకాట్లు నమోదైతున్నట్లు పశు సంవర్థక శాఖ వెల్లడించింది. కుక్క కాట్లకు గురైన వారు స్థానికంగా ఉండే ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. కొన్ని చోట్ల కుక్క కాటుకు మందు ఉంటే మరికొన్ని చోట్ల ప్రభుత్వ వైద్యశాలల్లో ఉండటం లేదు. కుక్క కాట్లకు గురైన వారు కాల క్రమంలో పిచ్చిపట్టినట్లు వ్యవహరించి చనిపోతున్నారని స్థానికులు చెబుతున్నారు.
రాష్ట్రంలో పెరుగుతున్న వీధి కుక్కల బెడద, జంతువుల జనన నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న కుక్కల దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, వీటిని అరికట్టేందుకు తక్షణమే ఆపరేషన్లను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
నగర పాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ అందించిన సమాచారం మేరకు ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ ఫామ్ (IHIP) డేటా ప్రకారం, 2022 నుంచి ఇప్పటి వరకు మొత్తం 7,05,555 కుక్కలు మనుషులపై దాడులు చేసి కాట్లు వేసినట్లు రాష్ట్రంలో నమోదయ్యాయి.
వార్షికంగా నమోదైన కేసులు
జనవరి - డిసెంబర్ 2022 : 1,91,995
జనవరి - డిసెంబర్ 2023 : 2,11,915
జనవరి - డిసెంబర్ 2024 : 2,44,914
జనవరి – 2025 మార్చి 23 వరకు : 59,725
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,43,656 వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా. అయితే వీటిలో కేవలం 68,192 కుక్కలు మాత్రమే శస్త్రచికిత్స ద్వారా స్టెరిలైజేషన్ అయ్యాయి. ఈ కార్యాచరణను మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆమోదించిన సేవాసంస్థలతో కలిసి అమలు చేస్తున్నారు.
స్థానిక సంస్థలకు ఆదేశాలు
మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేశ్ కుమార్ రాష్ట్రంలోని అన్ని నగర స్థానిక సంస్థల (ULBs) కమిషనర్లకు ఈ కింది కీలక ఆదేశాలు జారీ చేశారు.
ABC (Animal Birth Control) ప్రోగ్రామ్ ను వెంటనే ప్రారంభించాలి. 2023లో కేంద్ర ప్రభుత్వం ABC రూల్స్ 2023ని నోటిఫై చేసింది. ఇవి స్టెరిలైజేషన్, యాంటీ-రేబిస్ వ్యాక్సినేషన్ ను స్థానిక సంస్థల ద్వారా అమలు చేయాలని నిర్దేశించాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025లో స్థానిక ABC మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీ చేసింది. ఇవి కుక్కల జనాభా నియంత్రణ, రేబిస్ నిర్మూలన, మానవ-జంతు సంఘర్షణలను తగ్గించడానికి పనిచేస్తాయి.
పాఠశాలలు, బస్తీలు, ప్రజా సంస్థలు, నివాస ప్రాంతాలు వంటి హై రిస్క్ ఏరియాలు గుర్తించి, అక్కడ ABC కార్యక్రమాన్ని ప్రాధాన్యంగా అమలు చేయాలి.
సేవా సంస్థలకు నిధుల విడుదలను వేగవంతం చేయాలి. స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ (ARV), శస్త్ర చికిత్స నిర్వహణల వివరాలను సక్రమంగా డాక్యుమెంట్ చేయాలి.
ప్రజలలో జాగృతి కలిగించే కార్యక్రమాలు చేపట్టాలి. వీధి కుక్కలపై చిత్తశుద్ధితో పని చేసే స్వచ్ఛంద సంస్థలతో కలసి పనిచేయాలి.
పౌరులు పబ్లిక్ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం వేయకుండా, తగిన రీతిలో చెత్తను పారవేయాలి. నిర్లక్ష్యంగా ఆహారం వేయడం, చెత్తను బహిరంగంగా వేయడం వల్ల వీధి కుక్కల సంఖ్య పెరుగుతోంది.
పసు సంవర్థక శాఖ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ జంతు సంక్షేమ బోర్డు సభ్య కార్యదర్శి, రాష్ట్ర ABC పర్యవేక్షణ కమిటీ నోడల్ అధికారిగా ఉన్న పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ కూడా ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు.
ABC (Animal Birth Control), ARV (Anti Rabies Vaccination) కార్యక్రమాలను ULB లతో సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా నిర్వహించాలి.
అవసరమైన చోట కార్యనిర్వాహక సిబ్బంది, వెటర్నరీ డాక్టర్లను నియమించాలి.
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు (VAS), అసిస్టెంట్ డైరెక్టర్లు (ADs) అవసరమైన సంఖ్యలో నియమించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రాంతీయ స్థానిక సంస్థల అధికారులు, పౌరులు, సేవాసంస్థలు కలిసి పనిచేస్తేనే ఈ కుక్కల బెడదను నివారించవచ్చని ప్రభుత్వ అత్యున్నత అధికారులు ఒకటికి రెండు సార్లు చెబుతున్నారు.
ఏప్రిల్ 6న గుంటూరు వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి
నాలుగు సంవత్సరాల చిన్నారి బి ఐజాక్ (B Isaac) వీధి కుక్కల దాడిలో మరణించారు. 2025 ఏప్రిల్ 6 సాయంత్రం గుంటూరు నగరంలోని ఇద్వా నగర్ లో బాలునిపై వీధి కుక్కలు దాడి చేశాయి. దీని ఫలితంగా బాలుడు మరణించాడు.
గుంటూరులో ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం వీధి కుక్కలు ప్రస్తుతం 31,389 ఉన్నాయి. (2025 జనవరి సర్వే)
ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిన్నారి మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ సొమ్ము ఏప్రిల్ 7, 2025న (సోమవారం) కుటుంబానికి అందజేశారు.
వీధి కుక్కల సమస్యపై చర్యలు
రాష్ట్రంలో వీధి కుక్కల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు నాలుగు నెలల్లో కుక్కల స్టెరిలైజేషన్ చేయాలని ఆదేశించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ వివరిస్తూ రాష్ట్రంలో 3.43 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని, వీటిలో 2.03 లక్షలు ఇప్పటికే స్టెరిలైజ్ చేసినట్లు ముఖ్యమంత్రికి తెలిపారు.
పశు వైద్య సిబ్బంది నియామకం
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పశువైద్య అసిస్టెంట్ సర్జన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే జంతు నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.
ప్రజా ఆగ్రహం
గుంటూరు నగరంలో వీధి కుక్కల సమస్యపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. 2022 నుండి రాష్ట్రవ్యాప్తంగా 7,05,555 కుక్క కాటు కేసులు నమోదైనట్లు ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ ఫాం (IHIP) డేటా వెల్లడించింది.
స్థానిక రాజకీయ స్పందన
గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవిమాట్లాడుతూ.. నగరంలో కుక్కల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
నూతన ABC సెంటర్
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (GMC) తక్కెళ్లపాడు సమీపంలో రూ. 47 లక్షల వ్యయంతో కొత్త యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది.
సవాళ్లు
యానిమల్ రైట్స్ యాక్టివిస్టుల నుంచి వచ్చే ఫిర్యాదులు, కుక్కల నియంత్రణ సిబ్బందిపై దాడులు వంటి అడ్డంకులు కుక్కల స్టెరిలైజేషన్ ప్రక్రియలో సమస్యలుగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (AWBI) స్టెరిలైజేషన్ రికార్డులలో అసమానతలు, యానిమల్ హస్బెండ్రీ శాఖతో సమన్వయం లోపాలను గుర్తించింది.
విమర్శలు
జంతు సంక్షేమ కార్యకర్తలు, నిపుణులు ప్రభుత్వ చర్యలు సరిపోవని, అనవసర భయాందోళనలను రేకెత్తించాయని వాదించారు. కుక్కల అనియంత్రిత బ్రీడింగ్, పెట్ షాప్ లపై సరైన నియంత్రణ లేకపోవడం వీధి కుక్కల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తున్నాయని యాక్టివిస్టులు చెబుతున్నారు.
జంతు క్రూరత్వ నివారణ చట్టం- 1960
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంతు క్రూరత్వ నివారణ చట్టం, 1960 (Prevention of Cruelty to Animals Act, 1960) దాని కింద రూపొందించిన నిబంధనలను కఠినంగా అమలు చేయడం. ఇందులో జంతువులను రవాణా చేసేటప్పుడు, పశుగృహాలలో, లేదా ప్రదర్శనలలో వాటికి అనవసరమైన బాధ కలిగించకుండా చూడటం ఉంటుంది.
జంతు సంక్షేమ సంస్థలకు మద్దతు
రాష్ట్రంలో జంతు సంక్షేమ సంస్థలు (Animal Welfare Organizations - AWOs) గోశాలలకు గుర్తింపు ఇవ్వడం, ఆర్థిక సహాయం అందించడం. ఇందులో షెల్టర్ గ్రాంట్, యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) ప్రోగ్రామ్, రెస్క్యూ క్యాటిల్ గ్రాంట్, యాంబులెన్స్ గ్రాంట్, సహజ విపత్తుల సమయంలో జంతు రక్షణ కార్యక్రమాలు ఉన్నాయి.
స్ట్రీట్ యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) ప్రోగ్రామ్
వీధి కుక్కల జనాభా నియంత్రణ కోసం ABC కార్యక్రమాలను ప్రోత్సహించడం, అమలు చేయడం. ఇందులో స్టెరిలైజేషన్, టీకా కార్యక్రమాలు ఉన్నాయి. ఉదాహరణకు విశాఖపట్నంలోని VSPCA వంటి సంస్థలు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తాయి.
రియాలిటీలోకి రావాలి: VSPCA
దేనినైనా రియాలిటీలో చూసినప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుదని ‘విశాఖ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ కేరాఫ్ యానిమల్స్ (VSPCA) జాయింట్ సెక్రటరీ బి శారద చెప్పారు. ఆమె ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో మాట్లాడారు. గతంలో విశాఖపట్నంలో కుక్కలను పట్టుకుని కరెంట్ షాక్ ఇచ్చి కార్పొరేషన్ వారు చంపేసే వారని, దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో ఎన్జీవోలు వేసిన పిటీషన్ ను పరిశీలించి కోర్టు తీర్పు చెబుతూ చంపడం మంచిది కాదని, బర్త్ కంట్రోల్ కు ఆపరేషన్ లు చేయాలని ఆదేశించారు. దీంతో సగం ఖర్చు కార్పొరేషన్, సగం ఖర్చు ఎన్జీవో పెట్టుకునే విధంగా ఒప్పందం చేసుకుని 2018 వరకు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. చాలా మునిసిపాలిటీల్లో ఈ విధంగానే జరిగిందన్నారు. ఆ తరువాత కార్పొరేషన్ ఫండ్స్ ఇవ్వటం ఆపివేసిందని, తమ సొంత ఖర్చుతో వీధి కుక్కలను పట్టుకుని ఆపరేషన్ లు చేయిస్తున్నామన్నారు. తమ సంస్థలో ప్రస్తుతం 187 కుక్కలు ఉన్నాయని, డోనర్స్ ద్వారా నిధులు సేకరించి ఆపరేషన్ లు చేయించినట్లు తెలిపారు. తాము ఆపరేషన్లు చేయించలేని సమయంలో పిల్లలు పుడుతున్నాయని, వాటిని కూడా సాగాల్సి వస్తోందన్నారు.
పేదలకు బియ్యం ఇస్తున్నట్లుగా కుక్కలకు ఆహారం కోసం బియ్యం ఇవ్వాలని ఆమె కోరారు. నెలకు తమ సంస్థ ద్వారా 1.50 టన్నుల రైస్ వండి పెట్టాల్సి వస్తోందన్నారు. ఈ ఖర్చును భరించలేకపోతున్నామని చెప్పారు. అలా అని కుక్కలను వీధుల్లోకి వదిలేయలేమని అన్నారు. వీధుల్లో మటన్, చికెన్ కొట్ల వద్ద వీధి కుక్కలు రాకుండా చూడాల్సిన బాధ్యత కొట్లు నిర్వహించే వారు, మునిసిపాలిటీ వారు తీసుకోవాలన్నారు. పోలీసులకు ప్రజలపై వచ్చే కేసులే ఎక్కువవుతుంటే ఇక కుక్కలపై వచ్చే వాటి గురించి వారు ఎందుకు ఆలోచిస్తారన్నారు. ఏడాది కోసారి రేబిస్ వ్యాధి వ్యాక్సిన్ కుక్కలకు వేయాలని, మనుషులకు కూడా కుక్క కాటు మందు ముందుగా వేయించుకోవడం మంచిదని అన్నారు. ఎన్జీవోల మద్దతు లేకుండా మునిసిపాలిటీ వారు కుక్కల బర్త్ కంట్రోల్ చేస్తే మంచిదని, లేకుంటే సాయం తీసుకోవాలని కోరారు. ఆపరేషన్ లు చేస్తున్నామని లెక్కలు రాసి ఖర్చు చూపిస్తున్నారని, నిజంగా ఆపరేషన్ లు చేస్తే వెచ్చల విడిగా కుక్కలు ఎందుకు పెరుగుతాయన్నారు. విశాఖపట్నంలో వ్యాధులు సంభవించిన కుక్కలను యజమానులు కొందరు బీచ్ రోడ్డులో వదిలేసి వెళుతున్నారని, దీని వల్ల కూడా వీధి కుక్కల సంఖ్య పెరుగుతోందన్నారు.
300 నిపుణులైన వైద్యులు ఉన్నారు
రాష్ట్రంలో వీధి కుక్కలకు ఆపరేషన్లు చేసేందుకు ప్రత్యేకించి 300 డాక్టర్లకు శిక్షణ ఇచ్చినట్లు విజయవాడలోని ఎన్టీఆర్ పశువైద్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ కె శ్రీనివాసరావు తెలిపారు. ముందుగా మునిసిపాలిటీలు, రెండో దశలో పంచాయతీల్లో కుక్కలకు ఆపరేషన్ లు చేస్తే బాగుంటుందన్నారు. దీనికి మునిసిపాలిటీల వారు చొరవ తీసుకోవాలని, పంచాయతీ సర్పంచ్ లు మా సిబ్బందిని ఉపయోగించుకుని కుక్కల ఆపేషన్ లు సక్సెస్ ఫుల్ గా చేయవచ్చునన్నారు. సంవత్సరానికి ఒక సారి ర్యాబిస్ వ్యాక్సిన్ కుక్కలకు తప్పకుండా వేయాలన్నారు.
కుక్కల ఆపరేషన్ కోసం చేసే ఖర్చు ఎంత?
గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ (GMC) 2025 జనవరి నాటికి 31,389 వీధి కుక్కలలో 5,000 కుక్కలకు స్టెరిలైజేషన్ చేసింది. ఒక్కో కుక్కకు సగటున రూ. 1,500 ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి వీధి కుక్కల నియంత్రణ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారనే విషయమై ఏ అధికారీ ఖచ్చితమైన లెక్కలు చెప్పటం లేదు. అంటే గత ఆరు సంవత్సరాలుగా కుక్కలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పైసా గ్రాంట్ ఇవ్వలేదు. కేవలం మునిసిపల్ కార్పొరేషన్ ల వారు మాత్రమే ఎంతో కొంత ఖర్చు పెడుతున్నారు.