చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఓటు ఎక్కడ వేస్తున్నారో తెలుసా?
x

చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఓటు ఎక్కడ వేస్తున్నారో తెలుసా?

ప్రధాన పార్టీల అధినేతలకు వారి నియోజక వర్గాల్లో ఓటు లేదు. ఎక్కడ ఓటు వేస్తున్నారో తెలుసా?


ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు, టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ లు వారు పోటీ చేస్తున్న నియోజక వర్గాల్లో కాకుండా వేరే నియోజక వర్గాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన చెల్లెలు, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, కడప పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వైఎస్‌ షర్మిల మాత్రం వారు పోటీ చేస్తున్న చోటనే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కుప్పం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఎన్డీఏ కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న చంద్రబాబు నాయుడు కుప్పంలో కాకుండా తన కుమారుడు నారా లోకేష్‌ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజక వర్గంలోని ఉండల్లి గాదె రామయ్యసీతారావమ్మ మండల పరిషత్ పాఠశాలలో ఉదయం ఏడు గంటలకు తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

పిఠాపురం నుంచి ఎన్డీఏ కూటమి తరపున జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి కాకుండా నారా లోకేష్‌ బరిలో ఉన్న మంగళగిరి నియోజక వర్గంలోనే తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. లక్మినరసింహ కాలనీలోని గిరిజన సహకార సంస్థలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో పవన్‌ కల్యాణ్‌ తన ఓటును వేయనున్నారు. దగ్గుబాటి పురందేశ్వరి, ఆమె భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి రాజమండ్రిలో ఉదయం ఏడు గంటలకు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాను పోటీ చేస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గంలోనే తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే ఆయన చెల్లెలు, కపడ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వైఎస్‌ షర్మిల కూడా తాను పోటీ చేస్తున్న కడప పార్లమెంట్‌ పరిధిలోని పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ తాను పోటీ చేస్తున్న హిందూపూర్‌ అసెంబ్లీ నియోజక వర్గంలోనే తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తాను పోటీ చేస్తున్న మంగళగరి అంసెబ్లీ నియోజక వర్గంలోనే తన ఓటును వేయనున్నారు.
Read More
Next Story