జూన్‌ 1 నుంచి రేషన్‌ షాపుల ద్వారా సరుకుల పంపిణీ
x

జూన్‌ 1 నుంచి రేషన్‌ షాపుల ద్వారా సరుకుల పంపిణీ

విజయవాడలో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈపోస్‌ మిషన్లతో పాటు ఎలక్ట్రానిక్‌ కాటాల పనితీరును మంత్రి నాదెండ్ల మనోహర్‌ పరిశీలించారు.


జూన్‌ 1 నుంచి రేషన్‌ షాపుల నుంచే నిత్యావసర రేషన్‌ సరుకులను పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఆ మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆధ్వర్యంలో విజయవాడ మధురానగర్‌లోని 218వ రేషన్‌ షాపులో ట్రయల్‌ నిర్వహించారు. ఈపోస్‌ యంత్రాలను, ఎలక్ట్రానిక్‌ కాటాల పనితీరును పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సౌరభ్‌ గౌర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో వాహనాల ద్వారా కాకుండా రేషన్‌ షాపుల ద్వారానే నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని 29,760 రేషన్‌ డిపోలను ఇప్పటికే సిద్ధం చేశామన్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఈపోస్‌ యంత్రాలు, ఎలక్ట్రానిక్‌ కాటా పనితీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ట్రయల్‌ రన్‌ను నిర్వహించినట్లు తెలిపారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను నివారించేందుకు రేషన్‌ డిపోల ద్వారానే సరుకులు పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జూన్‌ 1 నుంచి మొదలు కానున్న ఈ ప్రక్రియకు సంబంధించిన పూర్తిస్థాయి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.

గత ప్రభుత్వంలో భారీగా రేషన్‌ బియ్యం అక్రమాలు చోటు చేసుకున్నాయని మండిపడ్డారు. రేషన్‌ సరుకుల పంపిణీ కూడా సక్రమంగా జరగ లేదని, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే రేషన్‌ సరుకులను పంపిణీ చేసేవారని అన్నారు. దీని వల్ల సకాలంలో లిబ్ధిదారులు రేషన్‌ను తీసుకోలేక పోయారని, పైగా ఈ విధానం వల్ల వేల కోట్లు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశారని జగన్‌ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. లబ్ధిదారులు రేషన్‌ సరుకులను తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశంతోనే రేషన్‌ డిపోల ద్వారా సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పనులన్నీ మానుకొని రేషన్‌ వ్యాన్ల కోసం ఎదురు చూడాల్సి పనిలేదన్నారు. రేషన్‌ సరుకుల పంపిణీకి సంబంధించిన ఈకేవైసీ నమోదు కూడా దాదాపు 96 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో 1.46 కోట్ల రేషన్‌ కార్డులు ఉన్నాయన్నారు. ఏపీలోని ప్రతి రేషన్‌ డిపో ఫొటో తీసి యాప్‌ ద్వారా దానిని ఆన్‌లైన్‌లో ఉంచామన్నారు. జూన్‌ 1 నుంచి రేషన్‌ సరుకుల పంపిణీ కోసం గురువారం సాయంత్రానికల్లా సరుకుల చేరుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. వృద్దులు, దివ్యాంగుల ఉంటే వారికి ఇళ్లకు వెళ్లి సరుకులను అందజేయడం జరుగుతుందన్నారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మధ్యలో ఆదివారాలు వచ్చినా సరే రేషన్‌ డిపోలు పని చేస్తాయని, లిబ్ధిదారులు వెళ్లి సరుకులు తీసుకోచ్చన్నారు.
Read More
Next Story