తిరుమల మెట్లోత్సవం- 3,500 మందితో భక్తి ప్రవాహం
x

తిరుమల మెట్లోత్సవం- 3,500 మందితో భక్తి ప్రవాహం

అలిపిరి నుండి తిరుమల వరకు భక్తి మార్గం – భక్తులతో కిటకిటలాడిన సప్తగిరులు


శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం అక్టోబర్ 31న (శుక్రవారం) అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. ముందుగా టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులతో కలిసి మెట్లపూజ నిర్వహించారు. అనంతరం మెట్లోత్సవాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. పూర్వం నుంచి ఎందరో మహనీయులు మెట్ల మార్గంలో తిరుమలకు నడిచివెళ్లి స్వామివారిని దర్శించుకున్నట్లు చెప్పారు. అలాంటివారి అడుగుజాడలో నడిచి శ్రీవారి కృపకు అందరూ పాత్రులు కావాలని తితిదే మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని ఆయన చెప్పారు.


పూర్వం శ్రీపురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.


శ్రీఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ, వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహిస్తున్నట్టు చెప్పారు. భజన మండళ్ల సభ్యులకు తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక శిక్షణ, దాస సాహిత్యంలో సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ ప్రాంతాలకు వెళ్లి భక్తజనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని తెలియజేశారు.


అంతకుముందు భజనమండళ్ల స‌భ్యులు అలిపిరి పాదాలమండపం వద్ద సంప్రదాయబద్ధంగా మెట్లపూజ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి 3,500 మందికిపైగా భజనమండళ్ల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను అధిరోహించారు.

భక్తిగీతాల నాదంతో అలిపిరి–తిరుమల మార్గం అంతా ఓ పుణ్య ప్రవాహంలా మారిపోయింది.
Read More
Next Story