
భక్తులతో క్రిక్కిరిసిన శ్రీశైల మల్లన్న ఆలయం
ముక్కంటి దేవుడి దర్శనానికి మూడు గంటల సమయం
నంద్యాల జిల్లా శ్రీశైలంలో కార్తీక సోమవారం మల్లికార్జునస్వామి క్షేత్రం భక్తులతో క్రిక్కిరిసింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద, ఉత్తర శివమాడవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఇప్పటికే శని, అది, సోమవారాలలో స్పర్శ దర్శనం, సామూహిక, గర్భాలయా అభిషేకాలు మాసంతం నిలుపుదల చేశారు. అలానే మంగళవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే రోజుకు మూడు విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతిస్తామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. నేడు సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. నేటి సాయంత్రం కార్తీక మొదటి సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.

