ఎన్టీఆర్ వైద్య సేవకు రేషన్ కార్డుల లింక్ కట్
x

ఎన్టీఆర్ వైద్య సేవకు రేషన్ కార్డుల లింక్ కట్

ఎన్టీఆర్ వైద్య సేవ కోసం ప్రత్యేకంగా కార్డులు జారీ చేసేందుకు శాసన సభ పిటీషన్ ల కమిటీ ప్రతాపాదనలు


తెల్ల రేషన్ కార్డుతో సంబందం లేకుండా ఎన్టీఆర్.వైద్య సేవ కార్డులను జారీచేస్తే రేషన్ బియ్యం స్మగ్లింగ్ ను పూర్తి స్థాయిలో అరికట్టే అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ అభిప్రాయ పడుతున్నట్లు ఆ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె రఘు రామకృష్ణ రాజు తెలిపారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ కమిటీ త్వరలోనే ప్రతిపాదలను పంపనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం రాష్ట్ర శాసన సభ ప్రాంగణంలోని తమ ఛాంబరులో కమిటీ సభ్యులు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే పి విష్ణు కుమార్ రాజుతో కలసి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడిచేశారు. ప్రతి ప్రభుత్వ పథకానికి తెల్ల రేషన్ కార్డే ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల తెల్ల రేషన్ కార్డు అవసరం లేనివారు కూడా ఈ కార్డును తీసుకోవడం వల్ల రేషన్ బియ్యం దుర్వినియోగం అవ్వడమే కాకుండా, భారీ ఎత్తున రేషన్ బియ్యం స్మగ్లింగ్ కు దారితీస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా ఒప్పుకుంటూ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డుల జారీ విషయంలో తెల్ల రేషన్ కార్డును డిలింక్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయనే అభిప్రాయాన్ని వారు కూడా వ్యక్తం చేశారని ఆయన తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.70 కోట్ల బిపిఎల్ ప్యామిలీలు ఉన్నాయని, వాటిలో దాదాపు 1.48 కోట్ల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎటు వంటి సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీకై దాదాపు రూ. 5,100 కోట్లను వెచ్చిస్తున్నదని, దీనిలో దాదాపు రూ.2 వేల కోట్ల వరకూ ఆదాచేసే అవకాశం ఉంటుందన్నారు. ఆ డబ్బులను విద్యపై ఖర్చుపెడితే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు భాటవేసేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక్క ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులకే కాకుండా ఎన్టీఆర్ భరోసా ఫించన్లు, ఇతర ప్రభుత్వ పథకాల మంజూరీ విషయంలో రేషన్ కార్డులను డిలింక్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

అంతకు ముందుకు శాసన సభా ప్రాంగణంలో చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె రఘు రామకృష్ణ రాజు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ సమావేశంలో శాసన సభ్యులు కొణతాల రామకృష్ణ, పి విష్ణు కుమార్ రాజు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో పాటు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంభ సంక్షేమ శాఖ స్పెషల్ సిఎస్ ఎంటి కృష్ణబాబు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరబౌ గౌర్, శాసన సభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, డిప్యుటీ సెక్రటరీ కె రాజకుమార్, అసిస్టెంట్ సెక్రటరీ ఆర్ శ్రీనివాసరావులు పాల్గొన్నారు.

Read More
Next Story