
విశాఖ విమ్స్లో కోవిడ్ రోగుల కోసం సిద్ధం చేసిన ప్రత్యేక వార్డు
కోవిడ్ నిజం.. మరణం అబద్ధం..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి కరోనా కేసు వైజాగ్లో నమోదైంది.
కరోనా నిజం.. మరణం అబద్ధం..! ప్రస్తుతం విశాఖపట్నంలో వైద్యారోగ్య శాఖ అధికారులు చేస్తున్న వాదన ఇది. ఈ సీజనులో రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖలోనే కోవిడ్ కేసు నమోదు అయింది. తొలి కోవిడ్ మరణమూ ఇక్కడే సంభవించింది.
సరిగ్గా వారం రోజుల క్రితం ఈనెల 23న విశాఖ నగరంలోని మద్దిలపాలెం పిఠాపురం కాలనీలో 28 ఏళ్ల మహిళకు కోవిడ్ సోకినట్టు తొలిసారిగా వెలుగు చూసింది. జ్వరం, జలుబు లక్షణాలతో ఉన్న ఆమెకు పరీక్షలు చేయించగా అది కోవిడ్గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమూ, వైద్యారోగ్య శాఖ అప్రమత్తమయ్యాయి. ఆ తర్వాత రెండు రోజులకే ఆ మహిళ ఇంట్లో మరొకరితో పాటు ఆమెకు వైద్యం చేసిన డాక్టరుకు కూడా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. వారికి కోవిడ్ చికిత్స అందించడంతో కోలుకున్నారు. ఇంతలో విశాఖ హెచ్బీ కాలనీకి చెందిన 64 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో నాలుగు రోజుల క్రితం చేరాడు. అయనకు కోవిడ్ లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రి వైద్యులు కరోలా పరీక్షలు నిర్వహించారు. ఆయనకు కోవిడ్ పాజిటివ్గా తేలింది. ఆయన చికిత్స పొందుతూ గురువారం ఆ ఆస్పత్రిలోనే మరణించాడు. దీంతో విశాఖలో కలకలం రేగింది. దీనిపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహహెచ్వో) డాక్టర్ పి. జగదీశ్వరరావు స్పందించారు. ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆ వ్యక్తికి రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్), న్యుమోనియా, పార్కిన్సన్స్ తదితర వ్యాధులున్నాయని, అందువల్లే ఆయన మృతి చెందాడు తప్ప కోవిడ్ వల్ల కాదని ఓ ప్రకటన విడుదల చేశారు. కార్పొరేట్ ఆస్పత్రి వర్గాలు మాత్రం తాము ప్రైవేటు ల్యాబ్లో కోవిడ్ పరీక్ష చేయించామని, అందులో ఆయనకు సోకింది కరోనా పాజిటివ్గా నివేదిక వచ్చిందని స్పష్టం చేశాయి.
వైద్యారోగ్య శాఖ వాదన ఇదీ..
ఎవరికైనా (ఏ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారైనా) కోవిడ్ సోకితే దాని నిర్ధారణకు నిర్దేశిత విశాఖపట్నం కేజీహెచ్లోని వీడీఆర్ఎల్ కేంద్రంలో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని విశాఖలోని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే గురువారం మరణించిన వ్యక్తి కేజీహెచ్ వీడీఆర్ఎల్లో కాకుండా ప్రైవేటు ల్యాబ్లో కోవిడ్ పరీక్ష చేయించుకున్నందున అది కరోనా కిందకు రాదని వాదిస్తున్నారు. పైగా జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇవ్వకుండా కరోనా వైద్యం అందించడం, కోవిడ్ మరణం అని ఎలా ధృవీకరిస్తారో వివరణ ఇవ్వాలని ఆ కార్పొరేట్ ఆస్పత్రికి నోటీసు జారీ చేయాలని నిర్ణయించారు. ఒకవేళ ఆ రోగికి కోవిడ్ లక్షణాలుంటే శాంపిల్ తీసి కేజీహెచ్లోని ప్రభుత్వ ల్యాబ్కు ఎందుకు పంపించలేదని ప్రశ్నిస్తున్నారు. దీనిని బట్టి విశాఖలో కోవిడ్ మరణాన్ని సాంకేతిక కారణాలు చూపుతూ కరోనాతో చనిపోలేదని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోందని అంటున్నారు. మరోవైపు విశాఖలో కరోనాతో ఇద్దరు మాత్రమే చికిత్స పొందుతున్నారని, గతంలో కోవిడ్ సోకిన వారు కోలుకోవడంతో డిశ్చార్జి చేశామని డీఎంహెచ్వో జగదీశ్వరరావు తెలిపారు. విశాఖలో కోవిడ్పై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని విమ్స్ డైరెక్టర్, కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ రాంబాబు స్పష్టం చేశారు.
విశాఖలో అప్రమత్తత ఇదీ!
కోవిడ్ కేసులు నమోదుతో విశాఖలో వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కోవిడ్ కేసు ఈనెల 23న వెలుగు చూసిన వెంటనే విశాఖ కింగ్ జార్జి ఆస్పత్రి (కేజీహెచ్)లో 40 పడకలు, విమ్స్ (విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో 20 పడకలతో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. వీటిలో కేజీహెచ్ క్యాజువాలిటీ పై అంతస్తులో 20 పడకలు, పాత బ్లడ్ బ్యాంకు పైన 20 పడకలు, విమ్స్లో 20 పడకలతో ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేశారు. కోవిడ్ అనుమానిత లక్షణాలున్న వారికి అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం 50 చొప్పున ర్యాపిడ్ కిట్లను అందుబాటులో ఉంచారు. ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ అని తేలితే నిర్ధారణ కోసం కేజీహెచ్లోని ఆర్టీపీసీఆర్కు పంపుతారు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు తలెత్తితే షిఫ్టుల వారీగా విధులు నిర్వహించేలా నర్సింగ్ సిబ్బందిని సన్నద్ధం చేశారు.
Next Story