
ఏపీలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.. జాగ్రత్తగా ఉండాలి
కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
భారత దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయని.. అందువల్ల కోవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సమూహాలుగా ఏర్పడే కార్యక్రమాలు చేయొద్దని, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఎయిర్ పోర్టుల్లో సోషల్ డిస్టెన్స్ పాటించాలని, మాస్క్లు తప్పనిసరిగా ధరించాలని మంత్రి సూచించారు. వృద్ధులు, గర్భవతులు ఇళ్ల నుంచి అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని తెలిపారు, విదేశాల నుంచి వచ్చిన వారు కొవిడ్ టెస్ట్ తప్పనిసరిగా చేసుకోవాలన్నారు,
మాస్కులు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ను ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యపరికారాలు అందుబాటులో ఉండేలా చూడాలని వైద్యాధికారులకు మంత్రి పార్థసారథి ఆదేశాలు జారీ చేశారు. అధికారులంతా సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక పర్యవేక్షణతో పనిచేయాలన్నారు, కోవిడ్ను ఎదుర్కోవడానికి గ్రామ, మండల స్థాయి ప్రభుత్వ అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించి తగిన జాగ్రత్తలు తీసుకొనేలా చూడాలని ఆదేశించారు, క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులకు మంత్రి పార్థసారథి సూచించారు. ప్రజలంతా మాస్క్ ధరించడం, శానిటేషన్ వాటడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవచ్చన్నారు.
Next Story