రేవంత్ ప్రభుత్వాన్ని గల్లా బెదిరిస్తున్నారా ?
x

రేవంత్ ప్రభుత్వాన్ని గల్లా బెదిరిస్తున్నారా ?

తెలంగాణా నుండి ఇతర రాష్ట్రాలకు తరలివెళ్ళటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఒక పెద్ద కార్పొరేట్ సంస్ధ ఛైర్మన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బెదిరించారు.


వినటానికే ఆశ్చర్యంగా ఉంది. ఒకవైపు తెలంగాణాలో పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమలు స్ధాపించండని రేవంత్ రెడ్డి అమెరికాలోని కార్పొరేట్ యాజమాన్యాలతో సమావేశాలు పెడుతున్నారు. కొందరు యజమానులు సానుకూలంగా స్పందిస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు హామీలు కూడా ఇస్తున్నారు. అమెరికా నుండి దక్షిణకొరియాలో కూడా రేవంత్ రెండురోజులు పర్యటించి 14వ తేదీకి హైదరాబాద్ తిరిగొస్తారు. సీన్ కట్ చేస్తే తెలంగాణా నుండి ఇతర రాష్ట్రాలకు తరలివెళ్ళటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఒక పెద్ద కార్పొరేట్ సంస్ధ ఛైర్మన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బెదిరించారు. తమకిచ్చిన హామీలను నెవరేర్చకపోతే తమ విస్తరణ ప్రణాళికలను నిలిపేసి తెలంగాణా నుండి తరలివెళిపోక తప్పదని స్పష్టంగా చెప్పేయటమే ఇపుడు హాట్ టాపిక్ అయిపోయింది.

ఇంతకీ విషయం ఏమిటంటే మహబూబ్ నగర్లో అమరరాజా బ్యాటరీస్ ఒక యూనిట్ ఏర్పాటు చేస్తోంది. రు. 9500 కోట్లతో ఏర్పాటుచేయబోతున్న యూనిట్ కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇపుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవటంలేదని అమరరాజా కంపెనీ ఛైర్మన్ గల్లా జయదేవ్ ఆరోపించారు. ఒక ప్రభుత్వం ఇచ్చిన హామీని నమ్మి తాము యూనిట్ ఏర్పాటుకు రెడీ అయితే ఇపుడున్న ప్రభుత్వం హామీని నెరవేర్చకపోతే ఎలాగ అని నిలదీస్తున్నారు. అప్పట్లో కేసీయార్ ప్రభుత్వం అమరరాజా కంపెనీకి ఇచ్చిన హామీలు ఏమిటి ? ఇపుడు రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకోవటం లేదన్న విషయాలను గల్లా చెప్పలేదు. కేసీయార్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటి రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవటంలేదని మాత్రమే గల్లా చెప్పారు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో అమరరాజా యాజమాన్యానికి చెడిందన్న విషయం బయటపడింది.

తమను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటంలేదన్న మంట పెరిగిపోబట్టే ఛైర్మన్ గల్లా జయదేవ్ ఈరోజు ఓపెన్ అయిపోయి బహిరంగ ఆరోపణలు చేశారు. దేశ దేశాలు తిరుగుతు పెట్టుబడులు పెట్టమని అడుగుతున్న రేవంత్ మరి తెలంగాణా నుండి యూనిట్ బయటకు వెళిపోతామని బెదిరించే పరిస్ధితులు ఎందుకు తీసుకొచ్చినట్లు ? అన్నదే అర్ధం కావటంలేదు. మోటార్ బైకులకు అమరరాజా బ్యాటరీలను తయారుచేస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కు అవసరమైన బ్యాటరీలను తయారు చేయాలన్న టార్గెట్ తో విస్తరణలో భాగంగా మహబూబ్ నగర్లో చాలా పెద్ద యూనిట్ ఏర్పాటుకు అమరరాజా రెడీ అయిపోయింది. అయితే బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏమైందో తెలీదు. ప్రభుత్వానికి కంపెనీ యాజమాన్యానికి మధ్య గొడవలు మొదలైపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాకపోతే ఏ విషయంలో వివాదాలు మొదలైందన్నది మాత్రం తెలీటంలేదు.

తాజాగా గల్లా బెదిరింపులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగేశారు. ట్విట్టర్ వేదికగా రేవంత్ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. అమరరాజా గ్రూపు విస్తరణ యూనిట్ ను తెలంగాణాకు తీసుకురావటానికి తాము ఎంతో కష్టపడినట్లు చెప్పారు. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం తన పెదధోరణులతో గ్రూపు విస్తరణను ఇతర రాష్ట్రాలకు తరలిపోయేట్లుగా చేస్తే తెలంగాణా తీవ్రంగా నష్టపోవాల్సొస్తుందని హెచ్చరించారు. మరి రేవంత్ విదేశాల నుండి తిరిగొచ్చిన తర్వాత ఈ విషయమై ఎలా స్పందిస్తారో చూడాలి.

Read More
Next Story