కలెక్టర్‌ గారూ..కుందూనదిలో కృత్రిమ వరదలను నిలవరించండి
x

కలెక్టర్‌ గారూ..కుందూనదిలో కృత్రిమ వరదలను నిలవరించండి

వెలుగోడు రిజర్వాయర్‌ స్పిల్‌ గేట్ల నుండి గాలేరు నదిలోకి నీటి విడుదల తక్షణమే ఆపాలని నంద్యాల జిల్లా కలెక్టర్‌ను బొజ్జా దశరథరామిరెడ్డి కోరారు.


కుందూ నదిలో కృత్రిమ వరదలను నిలవరించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి కోరారు. వెలుగోడు రిజర్వాయర్‌ స్పిల్‌ గేట్ల నుండి గాలేరు నదిలోకి నీటి విడుదల తక్షణమే ఆపాలని విజ్జప్తి చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుండి విడుదల చేస్తున్న కృష్ణా జలాలలో సగానికిపైగా కుందూనదిలోనికి విడుదల చేయడం వలన కృత్రిమ వరదలతో రైతుల పంట పొలాలు జలమయం అవుతున్నాయని, ఇప్పటికైనా కుందూనదిలోకి విడుదల చేసే నీటిని గణనీయంగా తగ్గించాలని కోరారు. ఆ మేరకు నంద్యాల జిల్లా కలెక్టర్‌ రాజకుమారికి విజ్ఞప్తి చేశారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యవర్గ సభ్యులతో, వరద నీటితో ముంపుకు గురైన పాములపాడు, కోవెలకుంట్ల, పెద్దముడియం మండల రైతు ప్రతినిధులతో కలిసి ఆయన కలెక్టర్‌ రాజకుమారికి వినతి ప్రతాన్ని సమర్పించారు.

కుందూనదిలో వరదలతో పాటు, బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుండి గోరుకల్లు రిజర్వాయర్‌ వరకు కృష్ణా జలాలను తీసుకొని పోయే ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 22,000 క్యూసెక్కులకు పెంచినప్పటికీ, కొన్ని వంతెనలు, ఆక్వడెక్టుల నిర్మాణాలు పూర్తి కాకపోవడం వల్ల 10,000 క్యూసెక్కులకు మించి నీటిని తరలించలేని పరిస్థితిలో కూడా 13,000 క్యూసెక్కుల నీటిని తరలించడంతో పాములపాడు మండలంలో పొలాలు మునగడం, జోము ఉండటంతో వేలాది ఎకరాలలో రైతులు నష్టపోతున్న విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి బొజ్జా తీసుకుని వచ్చారు. ఈ వరదల వల్ల పంట నష్టపోవడం, ఉప్పలం పొంగడంతో వ్యవసాయానికి పనికిరాకుండా పోవడం, పొలాలు కోతలకు గురవడం తదితర ఇబ్బందుల వలన రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్న విషయాలను కూడా కలెక్టర్‌కి వివరించారు.
కుందూనదిలోకి నీటి విడుదలను తగ్గించడానికి జలవనరుల శాఖ అధికారులకు, మరియు ముంపు వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చేలాగా రెవెన్యూ అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని బొజ్జా ఈ సందర్భంగా కలెక్టర్‌ని కోరారు. వెలుగోడు రిజర్వాయర్‌ స్పిల్వేగేట్ల ద్వారా నిరంతరము గాలేరు నదిలోనికి నీరు విడుదల చేయడం వలన కుందూనది పరీవాహక ప్రాంతంలో వరదలు సృష్టించడమే కాకుండా వెలుగోడు స్పిల్వేగేట్లకు కూడా భద్రత లేని పరిస్థితి కలుగుతున్న నేపథ్యంలో వెలుగోడు రిజర్వాయర్‌ స్పిల్వేగేట్ల ద్వారా నీటి విడుదలను ఆపాలని బొజ్జా కలెక్టర్‌కి విజ్ఞప్తి చేశారు.
ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించిన ఎస్‌ఆర్‌బీసీ రెగ్యులేటర్‌ ద్వారా కృష్ణా జలాలు ఎస్‌ఆర్‌బీసీ ప్రధాన కాలువకు చేరకుండా కాలువను శాశ్వతంగా మూసివేసి, ఆ కాలువను నిప్పులవాగుకు మళ్లించిన అంశంపై కూడా ప్రభుత్వానికి నివేదిక పంపాలని బొజ్జా ఈ సందర్భంగా కలెక్టర్‌ని కోరారు. పై అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని కలెక్టర్‌ గారు ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రతినిధుల బృందానికి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వై.యన్‌. రెడ్డి, కార్యదర్శి మహేశ్వరరెడ్డి, ప్రచార కార్యదర్శి నిట్టూరు సుధాకర్‌ రావు, కార్యవర్గ సభ్యులు కృష్ణమోహన్‌ రెడ్డి, కుందూ పరిరక్షణ సమితి నాయకులు డాక్టర్‌ శ్రీధర్‌ రెడ్డి, కడప జిల్లా పెద్దముడియం మండలంలో కుందూనది వరదలతో నష్టపోతున్న రైతుల ప్రతినిధి బసవేశ్వర రైతు సంఘం కార్యదర్శి ఎం సి కొండారెడ్డి, ఎస్‌ఆర్‌బీసీ ప్రధాన కాలువ వరదలతో నష్టపోతున్న పాములపాడు మండల రైతులు వెంకటేశ్వర్లు, చిన్న ఆవులరెడ్డి, కుందూనది వరదలతో నష్టపోతున్న కోయిలకుంట్ల మండలం రైతుల ప్రతినిధి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read More
Next Story